2014లో బంగ్లాదేశ్కు చెందిన యువకుడు మహమ్మద్ ఆలీ తప్పిపోయి.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం చేరుకున్నాడు. ఎవరితోనైనా మాట్లాడుదామంటే భాష రాదు. ఏం చేయాలో తోచక రావులపాలెం రోడ్లపై తిరిగాడు. అనుమానంతో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని బంగ్లాదేశ్ యువకుడిగా గుర్తించారు. వీసా, పాస్పోర్టు లేకపోవడంతో రెండేళ్లు రాజమహేంద్రవరం జైలులో శిక్ష అనుభవించాడు. 2016లో జైలు నుంచి విడుదలైన ఆలీ.. రావులపాలెం పోలీసుల పర్యవేక్షణలో ఉండేవాడు. మానసిక ఒత్తిడితో పోలీస్ వ్యాన్ అద్దం పగలగొట్టిన కేసులో 2019లో మరో ఏడాది జైలుకు వెళ్లొచ్చాడు.
నూతన ఎస్పీ రాకతో..
2021లో జిల్లాకు నూతన ఎస్పీగా రవీంద్రనాథ్ బాబు నియమితులయ్యారు. రావులపాలెం పోలీసుల ద్వారా ఆలీ గురించి తెలుసుకున్న ఎస్పీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి బంగ్లాదేశ్కు పంపించే ఏర్పాటు చేశారు. తాజాగా ట్రావెల్ పర్మిట్ వచ్చిన అనంతరం.. ఇండియా - బంగ్లా చెక్ పోస్ట్ వద్దకు వెళ్లిన రావులపాలెం ఎస్సై బుజ్జిబాబు నేతృత్వంలోని బృందం.. ఆలీని బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించింది.
సంతృప్తిగా..
ఏడేళ్ల క్రితం తప్పిపోయి వచ్చిన బంగ్లాదేశీయుడిని స్వదేశానికి పంపించడంలో తన పాత్ర ఉన్నందుకు ఎంతో సంతృప్తిగా ఉందని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. ఈ క్రమంలో ప్రత్యేక శ్రద్ధ చూపించిన ఏఎస్పీలు, ఎస్సై, సిబ్బందిని అభినందించారు. అధికారులకు అప్పగించే సమయంలో భావోద్వేగానికి గురైన ఆలీ.. కృతజ్ఞతలు తెలిపినట్లు ఎస్సై చెప్పారు.
ఇదీ చదవండి:
PV SINDHU: అప్పన్న ఆలయానికి సింధు.. మళ్లీ పతకం సాధిస్తానని దీమా