అల వైకుఠపురంలో.. చిత్ర మ్యూజికల్ నైట్ వేడుకపై వివాదం ఏర్పడింది. గడువు ముగిసినా కార్యక్రమం నిర్వహించడమే కాకుండా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తూ.. శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్తో పాటు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ యగ్నేష్ పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఈ నెల 6న సాయంత్రం యూసుఫ్గూడ బెటాలియన్ పోలీస్ గ్రౌండ్లో 'అల వైకుంఠపురంలో' సినిమా మ్యూజికల్ నైట్ ఫంక్షన్ నిర్వహించారు. కార్యక్రమం నిమిత్తం ఈ నెల 2న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ కె. యగ్నేష్ పోలీసుల అనుమతి తీసుకున్నారు. దాదాపు 5 నుంచి 6వేల మంది హాజరవుతారని రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం ముగుస్తుందని లేఖలో పేర్కొన్నారు.
రాత్రి 11:30 గంటల వరకు కార్యక్రమం నిర్వహించారు. గంటన్నర అదనంగా కొనసాగించడమే కాకుండా పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో ఆరువేల మందికి మాత్రమే పాస్ ఇచ్చామని పేర్కొన్నారు. కానీ.. 15 వేల మందిని ఆహ్వానించినట్లు గుర్తించారు.