తమ అభిమాన హీరో తర్వాతి సినిమా ఏంటా అని ఎదురుచూస్తున్న అభిమానులకు అల్లు అర్జున్ ట్రిపుల్ ధమాకా ఇచ్చాడు. ఒకేసారి మూడు సినిమాల్ని లైన్లో పెట్టేశాడు. త్రివిక్రమ్, సుకుమార్తో ఇప్పటికే సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా వేణు శ్రీరామ్ తెరకెక్కించే చిత్రంలోనూ హీరోగా నటించనున్నాడు.
2018లో వచ్చిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తర్వాత మరో సినిమా చేయలేదు అల్లు అర్జున్.
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పుడు మూడోసారి నటించనున్నాడీ మెగాహీరో. ఇంతకు ముందు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలకు వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఇప్పుడు వచ్చే కొత్త సినిమా తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఉండనుందని సమాచారం.

స్టైలిష్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలోనూ మూడోసారి నటించనున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే ఆర్య, ఆర్య-2 లతో మెప్పించారు. ఇప్పుడు అలాంటి కథతోనే సినిమా చేస్తారా లేదా వేరే జానర్లో చేస్తారా చూడాలి.

ఈ ఇద్దరు కాకుండా వేణు శ్రీరామ్ అనే కొత్త దర్శకుడితోనూ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడీ అల్లువారి అబ్బాయి. దిల్రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఐకాన్ కనబడుటలేదు' అనే వినూత్న టైటిల్ నిర్ణయించారు.

మరి ఈ మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటాయా లేదా అని చూడాల్సిందే.