తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు మయిల్సామి(57) ఆదివారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని నడిగర్ సంఘం తెలిపింది. మయిల్సామి సుమారు 100 సినిమాల్లో నటించారు. తమిళ అగ్రనటులు కమల్హాసన్, అజిత్, విజయ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
శివరాత్రి పర్వదినాన మయుల్సామి చెన్నైలోని సాలి గ్రామంలో ఉన్న శివాలయానికి వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన తుదిశ్వాస విడిచారు.
హాస్య నటుడు మయిల్సామి 1984లో దర్శకుడు భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన 'తవని తనపుమ్' చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్న ఆయనకు కమల్హాసన్ హీరోగా నటించిన సినిమా 'అపూర్వ సగోదర్గల్'లో అవకాశం దక్కింది. ఈ సినిమా మయిల్సామికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బిన్, పుదు, గిల్లి వంటి పలు చిత్రాల్లో తనదైన హాస్యాన్ని పండించారు. స్వతహాగా మయిల్సామి దివంగత తమిళ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి వీరాభిమాని. 2021లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విరుగంబాక్కం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొవిడ్ సమయంలో మయిల్సామి చాలా మంది నటులకు సాయం చేశారు.