ఫిబ్రవరి నెలలో మెుదటి వారం నుంచి వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురపాలక, నగరపాలక కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన మంత్రి బొత్స.. వార్డు సచివాలయాల ద్వారా పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలన్నీ అర్హులైన అందరికీ అందేలా చూడాలని అధికారులకు సూచించారు. పథకాల లబ్ధిదారుల జాబితాలను వార్డు సెక్రటేరియట్లలోని నోటీసు బోర్డుల్లో ఉంచాలని చెప్పారు. వార్డు సెక్రటరీల వేతనాలన్నీ సకాలంలో అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. భవన నిర్మాణాల అనుమతుల విషయంలో వస్తున్న ఆరోపణలు, అక్రమాలకు తావివ్వకుండా ఉండేందుకు ముగ్గురు అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణం కోసం లబ్ధిదారుల ఎంపిక సర్వే విషయంలో జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఆ ప్రాంతం...అరకు జిల్లాలో చేరనుందా..? ‘శ్రీకాకుళం నుంచి విడిపోనుందా..!