ETV Bharat / city

పుర పోరు: రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో ఎన్నికలంటే..! - ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

రాష్ట్రంలో మరో ఎన్నికలకు ఎస్ఈసీ సమరశంఖం పూరించింది. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 10న పోలింగ్ , 14న కౌంటింగ్ జరగనున్నట్టు వెల్లడించింది. మరీ రాష్ట్రంలోని ఎన్ని స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి..? ఇందులో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, ఎన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయో చూద్దాం.

ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2021
ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2021
author img

By

Published : Feb 15, 2021, 12:35 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. గతేడాది కరోనా కారణంగా నిలిచిన చోటు నుంచే మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను కొనసాగించనున్నట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అప్పుడు దాఖలు చేసిన నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ గడువునిచ్చింది. విజయనగరం, గ్రేటర్ విశాఖ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మీద 12 కార్పొరేషన్లలో 671 డివిజన్లకు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 2వేల 123 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 52లక్షల 52వేల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

ఉత్తరాంధ్రలో...

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస - కాశీబుగ్గ, పాలకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెల్లిమర్ల మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఉభయగోదావరి జిల్లాల్లో...

తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, పెద్దాపురం, యేలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మడివరం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించునున్నారు. కృష్ణాలోని నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ తిరువూరు మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది.

గుంటూరు జిల్లాలో తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లాలోచీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరులో పోలింగ్ జరగనుంది. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేటలో మున్సిపల్ ఎన్నికలు జరపనున్నారు.

సీమ జిల్లాల్లో...

అనంతపురం జిల్లాలో హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం, గుత్తి, కల్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లాలో ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, దోన్, నందికొట్కూరు, గూడూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరులో పోలింగ్ జరగనుంది. కడప జిల్లాలో ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు , రాయచోటి, మైదుకూరు, యర్రగుంట్ల మున్సిపలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. చిత్తూరు జిల్లాలో మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరులో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో మొత్తం 16 కార్పొరేషన్లు ఉండగా.. 12 చోట్లే ఎన్నికలు నిర్వహించనున్నారు. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో 4 చోట్ల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయలేదు. పాలకవర్గం గడువు ముగియకపోవటంతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికలు జరగబోవట్లేదు. నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం కార్పొరేషన్లలోనూ ఎన్నికలు ఉండబోవు. రాష్ట్రంలో 104 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉండగా.. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో 29 చోట్ల ఎన్నికలు నిర్వహించట్లేదు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.