Published : Feb 28, 2024, 4:20 PM IST
సిద్దిపేట జిల్లా కేంద్రంలో నీళ్లు కలిపిన పెట్రోల్ - వాహనదారుల ఆందోళన
Water Mixed With Petrol In Siddipet : పెట్రోల్ కల్తీ గురించి మనం తరచూ చూస్తూనే ఉంటాం. పెట్రోల్లో కిరోసిన్ కలపడం సహజమే కానీ ఏకంగా నీళ్లు కలపడం మాత్రం చాలా అరుదే. ఇలాంటి అరుదైన ఘటన సిద్ధిపేటలో జరిగింది. నీళ్లు కలిపిన పెట్రోల్ పోయించుకున్న వాహనాలు మొరాయించడంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది.
వంద దాటిన పెట్రోల్ ధరలతో జనం బెంబేలెత్తిపోతుంటే దానికి కల్తీ పెట్రోల్ కూడా తోడు అయింది. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ చౌరస్తాలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పెట్రోల్లో నీళ్లు వచ్చాయని వాహనదారులు ఆందోళనకు దిగారు. రూ.300ల పెట్రోల్ కొట్టించుకుంటే ఇంటికి వెళ్లేసరికే బండి ఆగిపోవడంతో మెకానిక్ వద్దకు తీసుకుపోతే ఆయనకు అసలు విషయం తెలిసింది. జిల్లా కేంద్రంలోని ఈ పెట్రోల్ పంప్లో వాటర్ రావడం తరచుగా జరుగుతుందని, ఆ బంకుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు, సివిల్ సప్లై అధికారులు పెట్రోల్ను పరీక్షలకు పంపారు.