ఎవ్వరికి స్వేచ్ఛ లేకుండా చేసిన జగన్, అధికారం పోయాక నీతులు మాట్లాడుతున్నారు-ఎమ్మెల్సీ భూమిరెడ్డి - MLC Bhumireddy fire on jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 7, 2024, 3:41 PM IST
TDP MLC Bhumireddy Ramagopal Reddy Fire on Jagan : వైఎస్సార్సీపీ పాలనలో టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని అధికారం పోయే సరికి నీతులు మాట్లాడుతున్నార ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. జగన్ తనను ప్రశ్నించిన రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయించి, నిరంకుశంగా వ్యవహరించిన వ్యక్తి జగన్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేక అరాచకాలు చేసిన జగన్ ఇప్పుడు సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ హయాంలో జరిగిన సహాకార సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుఫున పోటీ చేస్తున్నామనే అక్కసుతో తమపై అక్రమ కేసులు పెట్టి వేధించారని తెలిపారు.
పులివెందులలో ఉన్న తన ఇంటిని, టీడీపీ కార్యాలయాన్ని కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఐదేళ్లలో ప్రతిరోజు నేరాలు, ఘోరాలు చేస్తూ రాజకీయం చేసింది మీరు కాదా? అని జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ఎవ్వరికి స్వేచ్ఛ హక్కులు లేవని తెలిపారు. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించిన విలేకరులను, సమాన్య ప్రజలపై అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా హింసించారో రాష్ట్ర ప్రజలందరికి తెలుసన్నారు. ఇప్పుడు అధికారం పోయే సరికి నీతులు మాట్లాడుతున్నారని జగన్పై విరుచుకుపడ్డారు.