పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు - దుకాణానికి వెళ్లి వచ్చేలోపు రూ.3 లక్షలు మాయం - Theft from a bike in Anantapur Dist
By ETV Bharat Andhra Pradesh Team
Published : 2 hours ago
Thief Stole 3 Lakhs from Two Wheeler: పట్టపగలు, జనసంచారం ఉన్న ప్రాంతాల్లోనూ దొంగలు రెచ్చిపోతున్నారు. ఏ మాత్రం అదమరిచినా చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో విలువైన వస్తువులు, నగదు వాహనాలలో పెట్టి దుకాణానికి వెళ్లాలంటేనే బయపడే పరిస్థితి వచ్చింది. రెండు నిమిషాలే కదా అని వాహనం పార్క్ చేసి షాపింగ్ చేసి వచ్చేలోపు అందులో ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలో ద్విచక్రవాహనం బ్యాగులో ఉన్న 3 లక్షల రూపాయలను దుండగుడు అపహరించాడు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. వెంకటపల్లికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి బ్యాంకులో విత్డ్రా చేసిన నగదును బైక్ బ్యాగులో ఉంచి దుకాణానికి వెళ్లాడు. అతను తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని దొంగ బ్యాగులో ఉన్న నగదును తస్కరించాడు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.