By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 20, 2024, 9:46 PM IST
మూడవ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షలు
RTC Workers Strike Entered Third Day : ఆర్టీసీ యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విశాఖలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు మూడవ రోజుకు చేరుకున్నాయి. డ్యూటీ చార్ట్లు కౌన్సిలింగ్ పద్ధతిలో వేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం ఇష్టానుసారంగా డ్యూటీలు వేయడం సమంజసం కాదని కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ గాంధీ పార్కులో కార్మికులు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు.
నగరంలో జనాభా పెరుగుదలకు సరిపడా బస్సులు వేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కార్మికులు తెలిపారు. రిపేరుకు వచ్చిన బస్సులను వెంటనే బాగు చేసి బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసుల కారణంగా ఒక్కో కార్మికుడు నాలుగు నెలలు పని లేకుండా ఉండాల్సి వస్తుందని ఆవేదన వెలిబుచ్చారు. ఏ డిపో పరిధిలో పనిచేస్తున్న కార్మికులను అదే డిపోలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించేవరకు వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.