కనువిందు చేస్తున్న శేషాచలం జలపాతాలు - కపిల తీర్థంలో భక్తుల సందడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : 3 hours ago
Pleasant Weather at Tirumala And Waterfalls Attracting Tourists : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో ఒకటో కనుమరహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం భక్తులను అలరిస్తోంది. కపిలతీర్థం వద్ద జలపాతంలో కొండ నుంచి జారుతున్న నీటితో భక్తులు స్నానమాచరిస్తున్నారు. భక్తులు కపిలతీర్ధ జలపాతాలను చరవాణులలో బంధించి సెల్ఫీలు తీసుకుంటున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్ డి ఓ కార్యాలయాలలో సహయక కేంద్రాలు, కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. వర్షాల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ పలు జాగ్రత్తలు చేపట్టింది. కొండ చరియలపై ప్రత్యేక నిఘా, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.