TDP OFFICE GRIEVANCE: ఆటస్థలంగా ఉన్న భూమిని తప్పుడు ధ్రువపత్రాలతో అధికారులే కబ్జాదారులకు కట్టబెట్టారని వైఎస్సార్ జిల్లా సిద్ధవటానికి చెందిన పవన్ కుమార్ ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గండి బాబ్జి వినతులు స్వీకరించారు.
అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలోని చెరువుకు గండికోట ప్రాజెక్టు నుంచి చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని టీడీపీ నేత చల్లా చంద్రశేఖర్ నాయుడు వినతిపత్రం సమర్పించారు. భూరికార్డుల్ని ఆన్లైన్ చేయకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని కర్నూలు జిల్లా కౌతాళం మండలానికి చెందిన ఉప్పులపాటి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. తన తోటకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో నీరులేక అయిదెకరాల్లో దానిమ్మతోట ఎండిపోయిందని అనంతపురం జిల్లా నార్పల మండలానికి చెందిన శ్రీనివాసుల నాయుడు వాపోయారు.
మాకు ఉద్యోగాలు ఇవ్వాలి: 1998 డీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థులు ప్రజావేదికకు వచ్చారు. వైఎస్సార్సీ ప్రభుత్వంలో దాదాపు 6000 మందికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తామని అన్నారని, దీంతో తాము చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలను వదిలేశామని అన్నారు. అయితే ఆ సమయంలో జీవో 27 ప్రకారం కేవలం 4500 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. ఉద్యోగం వస్తుందనే కారణంతో మిగిలిన వారమంతా అప్పటి వరకూ చేస్తున్న ఉద్యోగాలు మానేసి రోడ్డున పడ్డామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు.
'వల్లభనేని వంశీ అనుచరులు మా భూమి కబ్జాకు యత్నిస్తున్నారు - న్యాయం చేయాలి'
'ఫిర్యాదు చేయడానికి వెళ్తే నాపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టారు'