Film Director RGV to Ongole Rural Police Station: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకానున్నారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ల ఫొటోలు మార్ఫింగ్, అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణకు పోలీసుల ఎదుటకు వర్మ వెళ్లనున్నారు. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, వ్యక్తిగతంగా హాజరవ్వాలని హైకోర్టు సూచించింది. దీంతో ఫిబ్రవరి 4న విచారణకు రావాలంటూ ఎస్పీ ఏఆర్ .దామోదర్ ఆయనకు నోటీసులు పంపించారు. వీటికి ఆర్జీవీ స్పందిస్తూ తాను ఫిబ్రవరి 4, 5వ తేదీలలో రాలేనని, 7వ తేదీ శుక్రవారం రోజు విచారణకు ఒంగోలు రూరల్ పీఎస్కు వెళ్లేందుకు రాంగోపాల్ వర్మ అంగీకరించారు.
Police Notice to Ram Gopal Varma : కాగా అసభ్యకర పోస్టుల కేసు దర్శకుడు రామ్గోపాల్ వర్మని గత కొంతకాలంగా వెంటాడుతోంది. ఈ వ్యవహారంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీసులు గత నెలలో మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 4వ తేదీన విచారణకు రావాలని ఆయనకు వాట్సప్ ద్వారా ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. అయితే 4న సినిమా షూటింగ్ల నిమిత్తం తాను బిజీగా ఉంటానని, విచారణకు రాలేనంటూ ఆర్జీవీ సమాధానమిచ్చారు. 7వ తేదీన విచారణకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తానని ఆర్జీవీ చెప్పారు.
గతంలోనూ పలుమార్లు ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆ సమయంలో విచారణకు హాజరుకాలేదు. అనంతరం హైకోర్టును ఆశ్రయించడంతో ఆర్జీవీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని, పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలంటూ రామ్గోపాల్ వర్మకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే గత నెలలో పోలీసులు నోటీసులు ఇచ్చారు.
RGV Case Updates : సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా రామ్గోపాల్ వర్మ అసభ్యకర పోస్టులు పెట్టారంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.