గుణదల రైల్వేఓవర్ బ్రిడ్జి- విడుదల ఎప్పుడు?! 15 ఏళ్లు గడచినా నెరవేరని కల
By ETV Bharat Andhra Pradesh Team
Published : 4 hours ago
People Facing Huge Problems Due To Gunadala Railway Bridge : శంకుస్థాపన జరిగి 15 ఏళ్లైనా విజయవాడ గుణదల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జికి మోక్షం కలగడం లేదు. గేటు పడితే చాలు గంటల తరబడి ప్రయాణికులు నిరీక్షించాల్సిన దుస్థితి. ఏలూరు, బందరు, రైవస్ కాలవలపై వంతెనలు ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ప్రభుత్వాలు మారినా తమ సమస్యకు మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"గత 15 ఏళ్లుగా ఈ రైల్వే గేటు సమస్య ఉంది. గేటు పడితే చాలు పిల్లలు స్కూలుకు వెళ్లాలన్న, ఉద్యోగులు ఆఫీస్లకు వెళ్లాలన్న సమయానికి వెళ్లలేక పోతున్నారు. అలాగే గర్భిణీలకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు అత్యవసర సమయంలో అంబులెన్సులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. చివరికి ఎక్కడికైనా త్వరగా వెళ్లాలని ఏదైన ఆటో, బైక్ను బుక్ చేసుకున్న ఈ ట్రాఫిక్కు భయపడి క్యాన్సిల్ చేసుకుంటున్నారు. గేటు పడితే కనీసం అర గంటసేపు సమయం వృథా అవుతోంది. బ్రిడ్జి నిర్మాణం కోసం కేవలం పిల్లర్లు వేసి అలాగే వదిలేశారు. ఏళ్లు గడిచిన మొండి గోడలతో ఉన్న ఫ్లైఓవర్ని పూర్తి చేయలేదు." - స్థానికులు