ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయాల్సిందే- కలెక్టర్లకు ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు - Mukesh Kumar Meena Video Conference
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 9:54 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-03-2024/640-480-21050820-thumbnail-16x9-mukesh-kumar-meena-review-on-election-arrangements.jpg)
Mukesh Kumar Meena Review on Election Arrangements : రాష్ట్రంలో ఎన్నిక నగారా మోగటంతో అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఎన్నికల నిబంధనావళిని అమలు చేస్తున్నారు. తాజాగా పెండింగ్లో ఉన్న ఫార్మ్-7, 8లను ఈ నెల 26లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ బృందాలు విస్తృతంగా పర్యటించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళిని పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని స్పష్టం చేశారు. అన్నీ పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులను కల్పించే పనులను వేగవంతం చేయలన్నారు.
సీ-విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కారించాలని కోరారు. అలాగే ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంను విస్తృత స్థాయిలో అమలు అయ్యేలా చూడాలని సూచించారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటినుంచి ఫ్లెక్సీల తొలగింపు, నేతల విగ్రహాలకు ముసుగులు వేసే పనులు చేపట్టారు. దీంతో నిన్నటి వరకు రంగు రంగుల పార్టీ జెండాలతో, పార్టీలకు చెందిన ఫ్లెక్సీలతో కళకళలాడిన ప్రధాన రహదారులు, కూడలి ప్రాంతాలు నేడు వెలవెలబోతున్నాయి.