Published : Mar 16, 2024, 2:53 PM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నేనుంటా : లాస్య నందిత సోదరి నివేదిత
MLA Lasya Nanditha Sister Niveditha Entry in Politics : సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత ఉంటానని స్పష్టం చేశారు. త్వరలోనే కేసీఆర్ను కలిసి పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తానని అన్నారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం అనంతరం ఉప ఎన్నిక బరిలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. నియోజకవర్గం ప్రజలు, పార్టీ కార్యకర్తలు సాయన్న కుటుంబం ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నారు ఆమె అన్నారు. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని పార్టీలు ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలో భాగంగానే అరెస్టు చేశారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు.