Published : Jun 20, 2024, 5:01 PM IST
వృద్ధాశ్రమంలో రామోజీరావు సంస్మరణ సభ - ఆయన సేవలను కొనియాడిన వృద్ధులు - TRIBUTE TO RAMOJI RAO IN BHADRADRI
Tribute To Ramoji At Old Age Home : భద్రాచలంలోని సుమారు 150 మంది అనాథ వృద్ధులు ఆశ్రయం పొందే వృద్ధాశ్రమానికి పక్కా భవనం నిర్మించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు రామోజీ గ్రూప్స్ ఛైర్మన్ రామోజీ రావు. ఇవాళ ఆయన దశదిన కర్మ సందర్భంగా వృద్ధాశ్రమంలో రామోజీరావు సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప వ్యక్తి రామోజీ రావు అని భద్రాచలానికి చెందిన సమాజ సేవకులు బి. సుధాకర్ కొనియాడారు.
ఒకప్పుడు వృద్ధాశ్రమానికి సరైన వసతి సౌకర్యం లేదని దీనివల్ల వేసవి, వర్షాకాలంలోనూ వృద్ధులు అనేక ఇబ్బందులకు గురయ్యేవారని సరోజినీ అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు సరోజినీ తెలిపారు. రామోజీరావు గొప్ప హృదయంతో రూ.80 లక్షలు వెచ్చించి వృద్ధాశ్రమానికి పక్కా భవనాన్ని నిర్మించి ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. దీంతో పాటు ఆశ్రమానికి ప్రహరీ, కిచెన్, టాయిలెట్లను ఏర్పాటు చేశారన్నారు. వీటితో పాటు బీరువా, టీవీ, ఇతర సామగ్రి అందించారని చెప్పారు. ఆయన చేసిన కృషి వల్ల ఈరోజు అనేక మంది వృద్ధులు చల్లటి నీడలో ఆశ్రయం పొందుతున్నారని పేర్కొన్నారు. ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.