శరన్నవరాత్రి వేడుకల్లో సీఎం సతీమణి - కల్వకుర్తిలో ప్రత్యేక పూజలు - CM REVANTH REDDY WIFE GEETHA REDDY
Published : 2 hours ago
Geetha Reddy in Kalwakurthy Temple: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కొనసాగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన కొండారెడ్డి పల్లెకి వెళుతూ మార్గమధ్యలో కల్వకుర్తి పట్టణంలోని అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గీతారెడ్డి గత రెండేళ్లుగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా దేవీ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించాలని తనవంతుగా లక్ష రూపాయల విరాళాన్ని నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు గీతారెడ్డిని శాలువాతో సన్మానించారు.
సీఎం రేవంత్ రెడ్డి తమది ప్రేమ వివాహమని ఆయనే పలు సందర్భాల్లో చెప్పారు. గీతారెడ్డి మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె. మొదటగా రేవంత్, గీతారెడ్డిలకు నాగార్జున సాగర్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం ఇంట్లో చెప్పడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత గీతారెడ్డి వాళ్ల నాన్నకు రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం నచ్చడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.