15 నుంచి సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక - Ban on Fishing for 61 Days in AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 3:49 PM IST
Ban on Fishing for 61 Days in AP: ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకూ సముద్ర జలాల్లో చేపల వేటపై నిషేధం విధించినట్టు మత్స్యశాఖ కమిషనర్ ఎ. సూర్య కుమారి స్పష్టం చేశారు. 61 రోజుల పాటు మెకనైజ్డ్ బోట్లు, మోటారు బోట్ల ద్వారా చేపట్టే అన్ని రకాల చేపల వేటను నిషేధిస్తున్నట్టు సూర్య కుమారి వెల్లడించారు. ఉత్తర్వులను ధిక్కరించి చేపల వేటకు వెళ్తే చట్టపరంగా చర్యలు చేపడతామని సూర్య కుమారి హెచ్చరించారు. నిషేధిత కాలంలో చేపల వేట జరగకుండా అమలు చేసేలా మత్స్యశాఖతో పాటు కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు చర్యలు చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు.
ఈ 61 రోజుల పాటు చేపల వేట నిలిపివేయటం వల్ల సముద్ర జలాల్లో చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి జరుగుతుందని తద్వారా వాటి సంతతి మరింత పెరుగుతుందని సూర్య కుమారి తెలిపారు. దీంతో మత్స్య సంపద అధికమయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించారు. సుస్థిరత సాధించేందుకే వేట నిషేధిస్తున్నట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి సముద్ర తీరప్రాంతాల్లో చేపల వేటకు వెళ్తే సముద్ర మత్స్య క్రమబద్దీకరణ చట్టం 1994ను అనుసరించి బోట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.