'మమ్మల్ని శైలజా మేడం తప్ప ఎవరూ నమ్మలేదు - మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం' - Tenth Class Girls Commits Suicide
Students Suicide in Yadadri : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినులు బలవన్మరణానికి పాల్పడ్డారు. హాస్టల్ గదిలో చెరో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తమను వేధించారంటూ 7వ తరగతి విద్యార్థినులు వార్డెన్కు ఫిర్యాదు చేయగా, అవమానంగా భావించి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
!['మమ్మల్ని శైలజా మేడం తప్ప ఎవరూ నమ్మలేదు - మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం' Two Tenth Class Girls Commits Suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-02-2024/1200-675-20663060-thumbnail-16x9-girl-sucide.jpg?imwidth=3840)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 4, 2024, 12:15 PM IST
Students Suicide in Yadadri : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని బలన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) వసతి గృహంలో ఉంటూ, పట్టణంలోని రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు.
మొయినాబాద్ యువతి సూసైడ్ కేసు - ఆ ఒక్క ఫుటేజీతో మిస్టరీ వీడింది
రోజు మాదిరిగానే శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు, తిరిగి సాయంత్రం వసతి గృహానికి వచ్చారు. తర్వాత వసతి గృహంలో నిర్వహించే ట్యూషన్కు హాజరుకాలేదు. ట్యూషన్ టీచర్ పిలవగా, తాము రాత్రి భోజనం చేశాక వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. భోజన సమయంలో కూడా వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని గది వద్దకు వెళ్లి చూడగా, అప్పటికే ఇద్దరు విద్యార్థినులు రెండు ఫ్యాన్లకు ఉరేసుకొని ఉన్నారు. వెంటనే 108 అంబులెన్స్ను రప్పించి ఇద్దరినీ జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
'JEE చదవలేను, అమ్మా, నాన్న క్షమించండి'- కోటాలో మరో విద్యార్థి సూసైడ్
Students Suicide in Yadadri Bhuvanagiri : సంఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ‘మేం వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేం తప్పు చేయకపోయినా, అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజా మేడం తప్ప ఎవరూ నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకచోటే సమాధి చేయండి’ అని ఆ లేఖలో రాసి ఉంది. హాస్టల్ వార్డెన్ శైలజా, ట్యూషన్ టీచర్ను భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ సురేశ్ కుమార్, ఎస్సై నాగరాజు, డీఈవో నారాయణరెడ్డి విచారిస్తున్నారు. హాస్టల్ విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ కారణంగానే ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని డీఈవో తెలిపారు.
Two Tenth Class Girls Commits Suicide In Hostel: స్నేహితులైన ఇద్దరు బాలికలు తమను వేధింపులకు గురి చేశారంటూ 7వ తరగతి విద్యార్థినులు పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె వసతి గృహం వార్డెన్ శైలజాకు సమాచారం ఇచ్చారు. వార్డెన్ ఇద్దరు బాలికలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని బాలికల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో తమపై ఫిర్యాదు చేయడాన్ని అవమానంగా భావించి ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
తల్లిదండ్రుల ఆందోళన : ఇదిలా ఉండగా, బాలికల హాస్టల్ వద్ద విద్యార్థినుల కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. హాస్టల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు మృతి చెందిన సమాచారం తమకు హాస్టల్ అధికారులు తెలపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూసైడ్ లెటర్ కూడా అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు.
suicide while take a video: కొడుకు వీడియో తీస్తుండగా.. తండ్రి ఆత్మహత్య