One Killed After Lorry Rash Driving in Karimnagar : మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో సుల్తానాబాద్లోని పూసాల వద్ద రోడ్డు పక్కన నిల్చోని అవతలి వైపు రోడ్డు దాటాడానికి నిరీక్షిస్తున్న నలుగురిపై కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వెళ్తున్న ఖాళీ లారీ దూసుకొచ్చింది. వారికి ఢీ కొట్టిన అనంతరం లారీ రాజీవ్ రహదారిపై కరీంనగర్ మార్గం వైపు వెళ్లింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు : మార్గమధ్యలో పానీపూరీ బండిని ఢీ కొట్టి, మళ్లీ డివైడర్ మీదుగా పెద్దపల్లి మార్గంవైపు వచ్చింది. అక్కడున్న ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లిన అనంతరం లారీ చెట్టును ఢీ కొట్టి ఆగిపోయింది. లారీ తమవైపునకు దూసుకొస్తుందనే భయంతో స్థానికులు పరుగులు తీశారు. కరీంనగర్ నుంచి సుల్తానాబాద్ వైపు వస్తున్న లారీని కాట్నపల్లి వద్దనే గమనించిన కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ లారీని వెంబడించిన స్థానికులు వాహనాన్ని ఆపేందుకు యత్నించారు దానికి సంబంధించిన వీడియోలు మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ మద్యం మత్తులో ఉండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు చేయకలేకపోయారని ప్రాథమికంగా నిర్ధారించారు.
హైదరాబాద్లో లారీ బీభత్సం - బైకును ఈడ్చుకెళ్లిన వీడియో వైరల్ - Road Accident In Hyderabad