Kodanda Reddy on Dharani portal : భారతదేశంలోనే అతి పెద్ద భూ కుంభంకోణం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని ధరణి కమిటీ సభ్యుడు, కిసాన్ కాంగ్రెస్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ను (Dharani portal) భూమిని కాజేయడానికే రూపొందిచారని, సర్వే ఆఫ్ ఇండియా అధికారి సైతం చెప్పారని ఆయన పేర్కొన్నారు. ధరణి కుంభకోణానికి కారకులు కేటీఆర్, కేసీఆర్లేనని ఆయన ధ్వజమెత్తారు.
ఆర్ఓఆర్(ROR) చట్టాన్ని సవరించాల్సిందే - సీఎం ముందుకు కమిటీ మధ్యంతర నివేదిక
అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో భూ కుంభకోణం జరిగిందని కోదండరెడ్డి (Kodanda Reddy) ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు అవగానే ధరణి కుంభకోణంలో ఉన్న ఎంత పెద్ద వారినైనా వదలకుండా చర్యలు తీసుకోవాలని, సీఎంను కోరతానని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయంతోనే ఎంతో మంది రైతులు చనిపోయారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kodanda Reddy fires on KCR and KTR : బీఆర్ఎస్ ప్రభుత్వం 22Aను ఆధారంగా చేసుకొని భూ కుంభకోణానికి పాల్పడిందని కోదండరెడ్డి ఆరోపించారు. శామీర్పేట మండలం తూంకుంట గ్రామంలో 164/1లో 26 ఎకరాల అటవీ భూమిని జూన్ 2022న ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని, సర్వే నెంబర్ 260/2 ,261 ,265/8 361/7 361/9 డిఫెన్స్ ల్యాండ్ని బాలాజీ అసోసియేట్ అనే సంస్థకు ధారాదత్తం చేశారని ఆరోపించారు.
బొమ్మరాశిపేట్ గ్రామంలో 1,065 ఎకరాల ప్రైవేట్ భూమిని అసలైన రైతులకు దక్కకుండా, సంతోష్ కుటుంబానికి చెందిన F4L farmsకు ధారాదత్తం చేశారని విమర్శించారు. జోగినపల్లి సంతోశ్రావు 23 ఎకరాల నిషేధిత భూమిని రిజర్వేషన్ చేసుకున్నారన్న ఆయన, గత ప్రభుత్వం వేల ఎకరాల రైతుల భూములను పూర్తిగా నిషేధిత జాబితాలో పెట్టి, ఎన్నికలు అవ్వగానే అంబూజ్ అగర్వాల్ పేరున రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.
24 లక్షల అసైన్డ్ భూమిని నిషేధిత జాబితాలో పెట్టి, వాళ్లకు అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టారని విమర్శించారు. హెచ్ఎండీఏను అడ్డుపెట్టుకొని, పేదల భూమిని లాక్కొని వేలం వేశారని ఆరోపించారు. చేవెళ్ల మండలం చందనవెల్లిలో 1500 ఎకరాలను దళిత రైతుల దగ్గర లాక్కొని, ఎకరాకు రూ.9 లక్షలు మాత్రమే చెల్లించారని, అదే భూమిని కేటీఆర్ తనకు అనుకూలంగా ఉన్న మల్టీ నేషనల్ కంపెనీకి రూ.1.30 కోట్లకు అమ్ముకున్నట్లు విమర్శించారు. అక్రమాలన్నింటినీ బయట పెట్టి, ప్రభుత్వానికి పూర్తి ఆధారాలతో నివేదించనున్నట్లు తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖను తమ వద్దనే ఉంచుకుని కుట్ర పూరితంగానే ధరణికి రూపకల్పన చేశారు. 24 లక్షల అసైన్డ్ భూమిని నిషేధిత జాబితాలో పెట్టి, వాళ్లకు అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టారు. ధరణి పోర్టల్ను భూమిని కాజేయడానికే రూపొందిచారు, సర్వే ఆఫ్ ఇండియా అధికారి సైతం ఇదే చెప్పారు. - కోదండరెడ్డి, ధరణి కమిటీ సభ్యుడు
భూమాత పోర్టల్ తీసుకొచ్చేందుకు సర్కారు కసరత్తు
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాల బదలాయింపు