Crypto Currency Fraud In Karimnagar : రూ.వేలల్లో పెట్టుబడులు పెడితే డాలర్లలో సంపాదన ఉంటుందన్న ఆశ సామాన్య, మిడిల్ క్లాస్ వారిని ఆకర్షిస్తోంది. డిజిటల్ కరెన్సీ క్రిప్టో పేరిట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న మార్కెటింగ్ వ్యాపారంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. నిర్మల్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ ఏజెంట్లపై కేసులు నమోదు కావడంతో ఆన్లైన్ ఇన్వెస్టిమెంట్స్ తిరిగి వస్తాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తమకు లాభాలు వచ్చాయని కొందరు చెబుతుంటే, చాలా మంది నష్టపోయారని జరుగుతున్న ప్రచారం మధ్య ఇన్వెస్టర్స్ అయోమయంలో ఉన్నారు. పదుల సంఖ్యలో యాప్ల ద్వారా వ్యాపారం జరగడం, ఇందులో కొన్ని మూతబడినట్లు చెబుతుండటంతో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.
3 స్టార్, 5 స్టార్, 7 స్టార్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు టీచర్లు, ఉద్యోగులు కూడా బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీ ఏజెంట్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లాలో పలువురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయగా ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు చెందిన టీచర్ల పాత్ర పైనా చర్చ జరుగుతోంది. ఆయా జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు, వివిధ శాఖల ఎంప్లాయిస్ ఇటీవల విదేశాలకు వెళ్లినట్లు తెలిసింది.
ఉద్యోగులు ఇతర దేశాలకు వెళ్లాలంటే శాఖాపరమైన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పలువురు నిబంధనలకు వ్యతిరేకంగా విదేశాలకు వెళ్లడంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో టీచర్లు ఈ వ్యవహారంలో డైరెక్ట్గా పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. బిట్కాయిన్, క్రిప్టోకరెన్సీ చైన్లింకింగ్ విస్తరించిన కొద్దీ 3 స్టార్, 5 స్టార్, 7 స్టార్ ఇలా ఐడెంటిఫికేషన్ ఇస్తారు. పలువురు సార్లు స్టార్లుగా ఎదిగే ప్రయత్నంలో రూల్స్ పాటించలేదని తెలుస్తోంది.
రియల్.. ఢమాల్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో రియల్ఎస్టేట్కు సంబంధించిన లావాదేవీలపై క్రిప్టోకరెన్సీ ప్రభావం పడింది. పొరుగునే ఉన్న ఆర్మూరు, నిర్మల్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో చైన్ లింకింగ్ కొనసాగుతుండటం, అధిక వడ్డీ ఆశించి పెద్దఎత్తున ఇన్వెస్టిమెంట్ చేయడంతో రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. 8 నుంచి 12 నెలలుగా బిట్కాయిన్, క్రిప్టోకరెన్సీ పేరిట అమాయకులను పలువురు ఆకర్షించడంతో సామన్యులు కూడా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. కొన్ని కరెన్సీలకు ఆన్లైన్లో పర్మిషన్లు ఉండటంతో అవి తిరిగి వస్తాయా లేదా అని తెలియకున్నా చాలా మంది పెట్టుబడులు పెట్టారు.
చాలా మంది భూములు తనఖా పెట్టి, అప్పులు తెచ్చిమరీ ఈ చైన్లింకింగ్లో చేరారు. గతంలో క్యూనెట్ పేరిట మోసపోయినా ఈ విడత పలు యాప్ల్లో పెట్టుబడులు పెట్టి కొందరు మోసపోగా మరికొందరు తమ పెట్టుబడి తిరిగి వస్తుందా లేదా అనే అనిశ్చితిలో ఉన్నారు. రూ.లక్ష నుంచి పెట్టుబడులు పెట్టిన వారికి నెలకు కొంత మొత్తంలో రిటర్న్స్ వస్తుండటంతో చాలా మంది అధిక లాభార్జనతో పెట్టుబడుల కోసం ఎగబడ్డారు. లాభాల ఆశతో రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన వారూ ఉన్నారని ప్రచారం జరుతుతుండటం విశేషంగా చెప్పుకుంటున్నారు. కొన్ని నెలలు ఈ ప్రక్రియ సజావుగా సాగినా సంబంధిత యాప్ ఆన్లైన్లో కనిపించడం లేదని తెలిశాక లబోదిబోమంటున్నారు. కేవలం జగిత్యాల జిల్లాలో రూ.800 నుంచి రూ.1,000 కోట్ల వరకు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరగుతుండటం, ఇదే సమయంలో స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో ఊహాగానాలకు ఊతమిచ్చినట్లవుతోంది.
పేర్లు ఏవైనా - పెట్టుబడులే లక్ష్యం : ఆన్లైన్ యాప్ల్లో పెట్టుబడి పెట్టడమే కానీ మోసం జరిగితే ఎలా ముందుకు సాగాలో తెలియకున్నా ఊళ్లకు ఊళ్లే ఈ గొలుసుకట్టులో పెట్టుబడులు పెడుతున్నారు. ఇటీవల వీఎంటీ, రెక్సోర్స్ యాప్స్ పేరిట పలువురు ఏజెంట్లు పెట్టుబడులను ఆకర్షిస్తూ, రూ.లక్ష పెట్టుబడిగా పెడితే నెలకు రూ.16 వేలు వస్తాయని చెప్పారు. దీంతో పలువురు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టారు. కొందరికి నెలనెలా రూ.16 వేల చొప్పున వచ్చాయని చెప్పడంతో నిజమో కాదో తెలియకున్నా మరింత మంది ఇన్వెస్టిమెంట్స్ చేశారు.
ఈ చైన్ లింకింగ్ ఫ్రాడ్లో కమీషన్ పెరిగిన కొద్దీ ఏజెంట్లకు స్టార్లు పెరుగుతూ వస్తాయి. 5 స్టార్ వచ్చిన వారికి రూ.2 కోట్ల వరకూ అమౌంట్ వస్తాయని చెప్పడంతో ఎక్కువ మంది పెట్టుబడుల కోసం ఎగబడుతున్నారు. చైన్ లింకింగ్లో టార్గెట్ చేరుకున్న ఏజెంట్లు, రూ.10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టినవారు జపాన్, యూకే, సింగపూర్, బ్యాంకాక్ తదితర దేశాలు ట్రిప్పుల పేరిట విదేశాలు తిరిగి వస్తున్నారు. దేశంలోని గోవా లాంటి టూరిస్ట్ ప్రాంతాలకు ఒక్కో విమానాన్ని బుక్ చేస్తుండటం, వాటిల్లో ఏజెంట్లను తిప్పుతుండటం ఈ వ్యాపారానికి ఉన్న క్రేజీని తెలుపుతోంది. గతంలో చాలా మంది క్యూనెట్ ద్వారా కూడా చైన్ లింకింగ్ పేరిట పెట్టుబడి పెట్టి ఘోరంగా మోసపోయారు. అయినా ప్రస్తుతం డిజిటల్ పెట్టుబడులు సురక్షితమో కాదో తెలియకున్నా చాలా మంది అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెడుతున్నారు.
- కోరుట్లలో హార్వెస్టర్లు రెండూ అమ్మేసి ఓ వ్యక్తి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. వాటి రికవరీ కోసం మరి కొంతమందిని ఈ గొలుసుకట్టులో చేర్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
- కోరుట్లలోనే ఓ వ్యాపారి రూ.కోటికి పైగా పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం జరుగుతుండగా, అందులో కొద్దిశాతం నగదు మాత్రం తిరిగి వచ్చినట్లు చెబుతున్నారు.
- పెగడపల్లి మండలంలోని ఓ గ్రామంలో పేద, మిడిల్ క్లాస్, హైలెవల్ క్లాస్ తేడా లేకుండా ఇంటింటికీ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
- మేడిపల్లి మండలంలోని రెండు మూడు గ్రామాల్లో ఇదే మాదిరి పెట్టుబడులు పెద్దఎత్తున పెట్టగా కొందరు దేశ, విదేశాల ట్రిప్పులు తిరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
- తాము పెట్టుబడి పెట్టిన యాప్ ఆన్లైన్లో కనిపించకపోవడంతో ఇటీవల జగిత్యాలకు చెందిన ఓ ఏజెంట్ వద్దకు పలువురు పెట్టుబడుదారులు పరుగులు తీశారు. తాను కూడా మోసపోయానని ఏజెంట్ చెప్పినా బాధితులు వినకపోవడంతో పెద్ద గొడవ జరిగినట్లు తెలిసింది.
- జగిత్యాల జిల్లా కోరుట్ల, మల్యాల, పెగడపల్లి, జగిత్యాల, మెట్పల్లి ప్రాంతాల్లోనూ అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
WhatsApp Scams : వాట్సాప్ స్కామ్స్ పెరిగిపోతున్నాయ్!.. జాగ్రత్తపడండి ఇలా!