CM Revanth Reddy Review of Revenue Department : రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రభుత్వ విభాగాలన్నీ నెలవారీ లక్ష్యాలు పెట్టుకొని నిర్ణీత రాబడులను సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ విభాగాల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత వార్షిక రాబడుల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, గనులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు నాలుగు గంటల పాటు సమీక్ష నిర్వహించారు.
పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని సీఎం హెచ్చరించారు. వార్షిక రాబడులు సాధించడం కోసం నెలవారీ లక్ష్యాలను పెట్టుకొని, పురోగతిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆదాయం తెచ్చి పెట్టే వనరులు, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలన్నారు. ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేసుకోవాలని విభాగాలను అవసరమైన విధంగా ఉంచుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జీఎస్టీ ఆదాయం పెంచుకునేలా వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జీఎస్టీ రాబడి పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పక్కాగా ఆడిటింగ్ చేయాలని ఆదేశించారు.
జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దు : జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దని నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెట్రోలు, డీజిల్పై వ్యాట్ ఆదాయం తగ్గినందున ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధనంపై పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను రేవంత్ రెడ్డి సూచించారు. ఇకపై ప్రతి నెల మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను స్వయంగా సమీక్ష నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతీ శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖలతో సమావేశం అవుతారని చెప్పారు.
మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయం ఏది : ఎన్నికల సందర్భంలో మద్యం అమ్మకాలుఎక్కువగా జరిగినప్పటికీ ఆ మేరకు ఆదాయం పెరగకపోవటానికి కారణాలేంటని సీఎం ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశముందని సమావేశంలో చర్చ జరిగింది. డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిఘా పెట్టాలని ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ది కార్యక్రమాలతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని సీఎం అన్నారు.
ఆరు నెలల్లో గృహ, వాణిజ్య నిర్మాణాలు పెరిగాయి : ఆరు నెలల్లో గృహ, వాణిజ్య నిర్మాణాలు పెరిగాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరిగిన భూముల రేట్లకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇసుక, ఖనిజ వనరుల అక్రమ రవాణాను, లీకేజీలను అరికడితే ఆదాయం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తిరిగి పన్ను వసూలు చేస్తున్నప్పటి నుంచి ఆ వాహనాల అమ్మకాలపై ఏమైనా ప్రభావం పడిందా అనే అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.