Lokesh On MOU With Meta : ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే గవర్నమెంట్ ఆఫీసులు, వివిధ హోదాలో ఉన్న అధికారులు, సిబ్బంది చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. కరెంటు, నల్లా, ఇంటి పన్ను, ఇతరత్రా బిల్లులు సైతం చెల్లించాలంటే సంబంధిత కార్యాలయాల్లో ఇప్పటికీ ఎడతెగని క్యూలలో నిరీక్షణ తప్పదు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఈ సర్టిఫికెట్ల కష్టాలను యువత ఏకరువు పెట్టారు. వాట్సప్లో ఒక్క టెక్ట్స్ మెసేజ్ చేస్తే ఇంటికే అవసరమైన సమస్త వస్తువులు వస్తున్నాయి. అదే విధంగా ప్రతి సేవలూ అందుతున్నాయి.
అలాంటప్పుడు సర్టిఫికెట్ల కోసం ఆఫీసులు చుట్టూ పనులు మానుకుని మరీ తిరగాల్సిన పరిస్థితికి చెక్ పెడతామని, ప్రభుత్వంలోకి రాగానే వాట్సప్ ద్వారా పర్మినెంట్ సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ప్రాధాన్యతాక్రమంలో అమలు చేస్తున్నారు. ప్రతి ఏటా క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా కేవలం వాట్సప్ ద్వారా పొందే పద్ధతి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వివిధ రకాల బిల్లులను సైతం వాట్సప్ ద్వారా చెల్లించవచ్చు. దీని కోసం మెటాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
వాట్సప్ బిజినెస్ ద్వారా మరిన్ని సేవలు : ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ప్రపంచమంతా విస్తరించిన మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ మంత్రి నారా లోకేశ్ చొరవతో వాట్సప్ బిజినెస్ ద్వారా ప్రజలకు పౌరసేవలను అందించేందుకు మెటా అంగీకరించింది. మెటా ఫ్లాట్ఫాం వాట్సప్ బిజినెస్ ద్వారా ఇకపై క్యాస్ట్, ఇతరత్రా సర్టిఫికెట్లు వేగంగా, సులభంగా పొందేందుకు వీలు అవుతుంది. అలాగే నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్లైన్లోనే సర్టిఫికెట్ల జారీ ఉంటుంది. మెటా నుంచి కన్సల్టేషన్ టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్ అమలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరిన్ని సిటిజెన్ సర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి అందించేలా మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు దిల్లీలో ఎంవోయూ చేసుకున్నారు.