Girl Hides in School Afraid of Her Father : నాన్నంటే ఓ ధైర్యం, ఓ నమ్మకం, ఓ భరోసా. నాన్న పక్కన ఉన్నాడంటే ఇక మనకు ఏ చింతా లేనట్లే. ఏ కష్టం వచ్చినా, ఎటు నుంచి ఏ ఆపద వచ్చినా తన ప్రాణాలను అడ్డేసి మనకు అండగా నిలబడతాడు. అందుకే నాన్న మనతో ఉన్నాడంటే మనకు ఎక్కడా లేని ధీమా ఉంటుంది. అయితే అందరు నాన్నలూ అలాగే ఉంటారని చెప్పడానికి లేదు. కన్నబిడ్డల్ని కాటేసే కామాంధులు, చిత్ర హింసలకు గురి చేసే దుర్మార్గులూ ఉంటారు. అలాంటి ఓ నాన్నే ఆ చిన్నారికి ఎదురయ్యాడు. అతడిని చూస్తేనే ఆమె ఆమడ దూరం పరిగెత్తేలా చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
'మా నాన్న రోజూ నన్ను కొడుతున్నాడు. ఎవరికైనా అమ్మేస్తా అంటున్నాడు. నాన్నను చూస్తేనే నాకు భయమేస్తోంది. నేను మా ఇంటికి వెళ్లను' అని 6th క్లాస్ చదివే ఓ విద్యార్థిని బిక్కుబిక్కుమంటూ పాఠశాలలో దాక్కున్న ఉదంతమిది. తన కుమార్తెను తనకు అప్పగించాలంటూ తండ్రి స్కూల్కెళ్లి గొడవపడటంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో గురువారం చోటుచేసుకుంది. ఎంఈవో గురువారావు, పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ బాబానగర్కు చెందిన అక్బర్, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కొన్ని నెలల క్రితం చౌటుప్పల్కు వచ్చి, అక్కడే నివాసం ఉంటున్నారు. ఆరో తరగతి చదువుతున్న వారి కుమార్తెను ఈ ఏడాదే చౌటుప్పల్లోని బంగారుగడ్డలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్పించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అక్బర్ భార్య తన మూడేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న అక్బర్, భార్యపై తనకున్న కోపాన్ని కుమార్తెపై చూపిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు.
బుధవారం రాత్రి కొట్టడంతో గురువారం బాలిక పాఠశాలకు రాలేదు. మధ్యాహ్నం సమయంలో బిక్కుబిక్కుమంటూ స్కూల్కు వచ్చిన బాలిక, తన బాధను ఫ్రెండ్స్కు చెప్పుకుని బోరున ఏడ్చింది. రాత్రి నుంచి ఏమీ తినలేదని, ఆకలిగా ఉందంటూ బావురుమంది. తోటి విద్యార్థులు విషయాన్ని టీచర్కు చెప్పడంతో ఆమె భోజనం పెట్టించి ఓదార్చారు. ఇదే సమయంలో మద్యం మత్తులో అక్కడకు వచ్చిన తండ్రిని చూసిన చిన్నారి, భయంతో అక్కడి నుంచి పరుగు పెట్టి, బడి వెనక భాగంలో ఉన్న 'భవిత' కేంద్రంలో దాక్కుంది.
స్కూళ్లో కుమార్తె కనిపించకపోవడంతో అతడు ఉపాధ్యాయులతో గొడవకు దిగి, దాడికి యత్నించాడు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. చివరకు అతడిని అక్కడి నుంచి పంపించేసి, బాలికను మండల వనరుల కేంద్రానికి తరలించారు. ఎంఈవో సమాచారం మేరకు పోలీసులు బాలికను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. జిల్లా బాలల సంరక్షణ కేంద్రం అధికారికి సమాచారం ఇవ్వడంతో వారు బాలికను బాల సదన్కు తీసుకెళ్లారు.