Yuzvendra Chahal : టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు భారత స్టార్ ప్లేయర్ క్షమాపణలు చెప్పాడు. చెవులు పట్టుకొని తనను క్షమించాలని కోరాడు. దీనికి సంబంధించిన బీసీసీఐ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అయ్యింది. మరి చాహల్కు సారీ చెప్పింది ఎవరు? ఎందుకు చెప్పాడంటే?
టీమ్ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో తలపడుతోంది. సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో అతడు ఓ అరుదైన మైలురాయి అందుకున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా ఘనత సాధించాడు. ఈ క్రమంలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (96 వికెట్లు) రికార్డ్ను బ్రేక్ చేశాడు. అర్షదీప్ 61 మ్యాచ్ల్లో 97 వికెట్లు పడగొట్టి, ప్రస్తుతం భారత్ తరఫున టీ20ల్లో టాప్ బౌలర్గా కొనసాగుతున్నాడు.
అయితే కొన్నాళ్లుగా చాహల్ పేరిట ఉన్న ఈ రికార్డ్ను తాను బ్రేక్ చేసినందుకు అర్షదీప్ సారీ చెప్పాడు (సరదాగా). మ్యాచ్ అనంతరం బీసీసీఐ ఇంటరాక్షన్లో మాట్లాడిన అర్షదీప్ ఈ కామెంట్స్ చేశాడు. దీంతో అర్షదీప్ 'వెరీ ఫన్నీ' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక మ్యాచ్విషయానికొస్తే, ఇంగ్లాండ్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 12.5 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది. అభిషేక్ శర్మ (79 పరుగులు, 34 బంతుల్లో; 5x4, 8x6) సూపర్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. భారత్ అంతకుముందు ఇంగ్లాండ్ను 132 పరుగులకే కట్టడి చేసింది. జాస్ బట్లర్ (68 పరుగులు) ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. టీమ్ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1- 0తో ఆధిక్యం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శనివారం జరగనుంది. ఈ మ్యాచ్కు చెన్నై చెపాక్ స్టేడియం వేదిక కానుంది.
ఇంగ్లాండ్తో రెండో T20- చెపాక్లోనూ చెక్ పెట్టెందుకు ప్లాన్
'సింగ్ ఈజ్ కింగ్': చరిత్ర సృష్టించిన అర్షదీప్- టీ20ల్లో ఆల్టైమ్ రికార్డ్