Special Story on Tollywood Cinema Piracy : సినీ పరిశ్రమకు పట్టిన చీడ పురుగు పైరసీ. కోట్లాది రూపాయల పెట్టుబడి, వందలమంది కష్టానికి గండికొడుతూ పైరసీ సినిమా రంగానికి అతి పెద్ద సమస్యగా మారింది. సినిమా అలా విడుదలవుతుందో లేదో ఇలా పైరసీ ప్రింట్లను పెడుతూ పైరసీ మాఫియా నిర్మాతల ఆదాయా న్ని దెబ్బతీస్తోంది. సినిమా డిజిటల్ హంగులు అద్దుకోవడంతో ఈ రక్కసి కోరలు మరింత విస్తరిస్తున్నాయి. చిన్న, పెద్ద, ఆ భాష, ఈ భాష అనే తేడా లేకుండా సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే పైరసీ చిత్రాలు హల్చల్ చేస్తున్నాయి. ఓటీటీ మార్కెట్ ను కూడా దెబ్బతీస్తున్నాయి. మరి పైరసీని అడ్డుకునేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన సెల్ ఏం చేస్తోందో తెలుసా?
సినీ పరిశ్రమకు సవాళ్లు : ఓ అగ్ర హీరో సినిమా విడుదలైన రోజు అభిమానులంతా ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లో బొమ్మ పడింది. బ్లాక్ బస్టర్ టాక్ బయటికొచ్చింది. కట్ చేస్తే 24 గంటలు కాకముందే ఆ సినిమా హై క్వాలిటీతో నెట్టింట కనిపించే సరికి పరిశ్రమంతా అవాక్కైంది. ఇంకో హీరో సినిమా విడుదలైన 2 రోజుల్లోనే ఓ ఆర్టీసీ బస్లో హెచ్ డీ ప్రింట్తో ప్రదర్శించారు. వాట్సప్లో లింకులు టెలిగ్రామ్లో షేరింగ్లు యూట్యూబ్లో ముక్కలు ముక్కలుగా సినిమా.
అయినా సరే అన్నీ భరించి ఓటీటీకి ఇచ్చినా ఆ మరుక్షణమే సర్వర్లోకి చొరబడి మరీ కొల్లగొడుతున్నారు. ఇదీ పైరసీ మాఫియా సినీ పరిశ్రమకు విసురుతున్న సవాళ్లు. కోట్ల రూపాయల పెట్టుబడిని గంటల వ్యవధిలో ఆవిరి చేస్తోంది ఈ మాఫియా. పైరసీ దెబ్బకు గతేడాది దేశవ్యాప్తంగా 22 వేల 400 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులో 13 వేల 700 కోట్ల రూపాయలు థియేటర్లు నష్టపోగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్కు 8,700 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఓ అధ్యయనంలో తేలింది.
ఓటీటీ సంస్థలకు నష్టం : నిజానికి భారతీయ చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా స్థాయి, స్థానం మారింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సినిమాలను అందిస్తోందని టాలీవుడ్ పేరు సంపాదించినా పైరసీ వలలో చిక్కి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. టాలీవుడ్లో ఏటా సుమారు 300 సినిమాలు విడుదలైతే అందులో నిర్మాతలకు, పంపిణీదారులకు, సినిమాపై ఆధారపడ్డ వాళ్లకు లాభాలు తెచ్చిపెట్టేవి 20 నుంచి 25 సినిమాలే ఉంటాయి.
అయితే అందులో ఘన విజయం సాధించిన చిత్రాలకు కూడా వసూళ్ల పరం గా ప్రతికూలత ఎదురవుతోంది. కారణం విడుదలైన రోజే ఆ చిత్రాలు పైరసీ బారినపడటం. అభిమానులు మినహాయిస్తే థియేటర్లో చూద్దామని భావించిన ప్రేక్షకుడికి పైరసీ ప్రింట్ దొరకడంతో డౌన్లోడ్ చేసుకొని చూడటం థియేటర్ వసూళ్లపై ప్రభావం చూపుతోంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా క్షణాల్లో అత్యంత నాణ్యమైన ప్రింట్ పైరసీ సైట్లలో కనిపించడంతో ఓటీటీ సంస్థలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి.
ఒకేసారి వేలాది ప్రింట్లు రిలీజ్ : ఒకప్పుడు థియేటర్లలో సినిమాలను రికార్డ్ చేసి వీడియో క్యాసెట్లు, సీడీలు, డీవీడీల రూపంలో పైరసీ చేసి సంతలో కూరగాయలు అమ్మినట్లు అమ్మేవారు. వీడియో దుకాణాల్లో అద్దెలకు ఇస్తూ సొమ్ము చేసుకునేవారు. ఈ రాకెట్ను పట్టుకునేందుకు పరిశ్రమ వర్గాలు, పోలీసులు గుర్తించి చర్యలు తీసుకునేవారు. కొన్నిసార్లు ఇంటి దొంగలు కూడా ఎడిట్ రూమ్ నుంచే సినిమా లను లీక్ చేసేవారు. కాలక్రమంలో సినిమా ప్రింట్ల నుంచి డిజిటల్ రూపంలోకి మారింది.
ఒకేసారి వేలాది ప్రింట్లు రిలీజ్ చేయడం, విదేశాలకు సైతం ఆన్లైన్లో పంపడం పైరసీ మాఫియా పని మరింత సులభమైంది. సర్వర్ల నుంచే సినిమా ఫైల్ ను హ్యాక్ చేసి వెబ్సైట్లలో పెట్టేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారనేది కూడా తెలియకుండా పకడ్బందీ సాంకేతికతతో పైరసీకి పాల్పడుతున్నారు. వారిని కనిపెట్టి ఆ లింకులను తొలగించేలోగా సినిమాకు జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోతుంది.
పైరసీని అడ్డుకునే ప్రయత్నాలు : పైరసీ నుంచి పరిశ్రమను రక్షించుకునేందుకు కొన్నాళ్ల కిందట తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. పలువురు సాంకేతిక నిపుణుల్ని నియమించి దూకుడుగా పని చేశారు. సీడీలు, డీవీడీలు పట్టుకోవడం, ఇంటర్నెట్లో పైరసీ లింకులు తొలగించే వారు. ఇందుకు పైరసీకి గురైన సినిమాల నిర్మాతలు నిర్ణీత మొత్తం చెల్లించేవారు. దీంతో కొన్నాళ్లు ఆ సెల్ పైరసీని అడ్డుకోగలింది.
తర్వాత నిర్మాతలు పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఆ సెల్ పని తీరు అంతంత మాత్రంగానే తయారైంది. తమ వద్దకు వచ్చే నిర్మాతలకు సంబంధించిన లింకులను మాత్రమే డౌన్ చేయడం, తొలగించడం చేస్తున్నారు. మరికొంత మంది నిర్మాతలు ప్రైవేటు సంస్థలను ఆశ్రయించి పైరసీని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించడం లేదు.
ఏపీఎస్ఆర్టీసీ బస్సులో పైరసీ కాపీ ప్రదర్శన : ఇటీవల రామ్చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా అత్యంత నాణ్యతతో ఆన్లైన్లోకి వచ్చింది. దీంతో చిత్ర బృందం, మెగా అభిమానులు సైతం షాకయ్యారు. ఓ లోకల్ ఛానల్లో పైరసీ కాపీని ప్రసారం చేయడం చర్చనీయాంశమైంది. మెగా అభిమానులు రంగంలోకి దిగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా కూడా నెట్టింటి నుంచి ఆ పైరసీ కాపీ తొలగించలేక పోయారు.
మొన్నటికి మొన్న నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం విడుదలై 3 రోజులు కాకముందే పైరసీ కాపీని ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. దీనిపై ఆ చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవర్ సీస్ కు పంపిన ప్రింట్ నుంచి పైరసీ అయినట్లు గుర్తించామని, ఆఫ్రికా దేశాల నుంచి అప్లోడ్ చేసినట్లు తేల్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో పైరసీ సెల్ను మరోసారి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నటులు, నిర్మాతలు కోరుతున్నారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాత్రం పైరసీని అడ్డుకోవడం తప్ప పూర్తిగా నివారించలేమని చెబుతోంది. పైరసీదారులను గుర్తించి కేసు పెడితే 20 రోజుల్లో బెయిల్ పై బయటికి వస్తున్నారని, కేసు పెట్టిన నిర్మాతలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అంటోంది. అందువల్లే నిర్మాతలు పైరసీని నియంత్రించేందుకు పెద్దగా దృష్టి సారించడం లేదని చెబుతోంది.
సామాజిక మాద్యమాల్లో పోస్ట్ : ఒకప్పుడు థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులు టైటిల్ కార్డ్ నుంచి శుభం కార్డ్ వరకు సినిమాను ఆస్వాదించేవాళ్లు. స్మార్ట్ ఫోన్ రావడం, డాటా వినియోగం ఎక్కువ కావడంతో పైరసీ జాడ్యం ముదిరింది. సినిమా మొదలవడమే ఆలస్యం కొందరు ఫోన్లో రికార్డ్ చేసి స్టేటస్లుగా పెట్టడం, స్నేహితులకు పంపడం చేస్తున్నారు. ఇంకొందరు వాటిని సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. దీని వల్ల చాలా మంది ముందే ఆ సన్నివేశాలను చూస్తున్నారు.
ఇక థియేటర్లో తొలిసారి ఆ సినిమా చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి సగటు ప్రేక్షకుడు కోల్పోతున్నాడు. చదువుకున్న వాళ్ల ప్రవర్తన ఇలా ఉంటే ఆకతాయిల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు సెల్ఫోన్లలో చిత్రీకరించడాన్ని అడ్డుకోవడం సాధ్యమైనా ఇప్పుడు కుదరడం లేదని థియేటర్ యాజమాన్యాలు అంటున్నాయి.
నెగిటివ్ టాక్ వచ్చేలా పోస్టులు : అగ్ర హీరోల అభిమానుల ఆధిపత్య పోరు కూడా సినిమా పైరసీకి కారణం అవుతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. తమకు నచ్చని హీరో సినిమా విడుదలైతే మొదటి రోజే నెగిటివ్ టాక్ వచ్చేలా పోస్టులు పెట్టడం, హ్యాష్ ట్యాగ్స్తో ట్రెండ్ చేయడం పరిపాటిగా మారుతోంది. తెలిసి కొందరు, తెలియక కొందరు ఈ ఉచ్చులో చిక్కి పోలీసు కేసుల వరకు తెచ్చుకుంటున్నారు.
నిర్మాతల బాధ : పైరసీ ఒక తెలుగు సినిమానే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను తీవ్రంగా వేధిస్తోంది. సినిమాలు తీయాలంటే నిర్మాతలు బెంబేలెత్తిపోయేలా చేస్తోంది. అప్పులు చేసి తీసిన సినిమాలకు వసూళ్లు రాకపోవడం ఒక బాధ అయితే పైరసీ బారినపడి మొత్తానికి మొత్తం తుడిచిపెట్టుకోవడం నిర్మాతలకు శరాఘాతంగా మారుతోంది.
అడ్మిన్లు బీ కేర్ ఫుల్, మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంది - అల్లు వార్నింగ్
సినీ లవర్స్కు షాకింగ్ న్యూస్! - ఇకపై మీ అభిమాన హీరో మూవీ సీన్స్ను స్టేటస్గా పెట్టుకోలేరు!!