Hamas Agrees To US Proposal : హమాస్, ఇజ్రాయెల్ల మధ్య తొమ్మిది నెలలుగా జరుగుతున్న యుద్ధం ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా అమెరికా ప్రతిపాదించిన విడతలవారీ కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించింది. ఇజ్రాయెల్ పూర్తిగా యుద్ధం ముగించాలనే షరతును ఉపసంహరించుకున్న హమాస్, ఈ ఒప్పందానికి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరింది. అయితే ఈ ఒప్పందానికి ఇప్పటి వరకు ఎలాంటి గ్యారంటీ లేదని సంబంధితవర్గాలు తెలిపాయి.
అమెరికా ప్రతిపాదన ప్రకారం, తొలుత 6 వారాలపాటు పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో కొందరు ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయాలి. అందుకు బదులుగా పాలస్తీనాకు చెందిన వందలాది మంది ఖైదీలను ఇజ్రాయెల్ వదలిపెడుతుంది. 42 రోజుల వ్యవధిలో గాజాలోని జనసమర్థ ప్రాంతాల నుంచి, ఇజ్రాయెల్ సైనికులు వైదొలిగుతారు. అక్కడి ప్రజలు తిరిగి తమ స్వస్థలాలకు వచ్చేందుకు సహకరిస్తారు.
రెండో విడతలో హమాస్ వద్ద ఉన్న పురుష బందీలను విడుదల చేయాలి. అందుకు బదులుగా ఇజ్రాయెల్ మరింత మంది ఖైదీలను విడుదల చేస్తుంది. మూడో విడతలో ఇజ్రాయెల్కు చెందిన మిగతా బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బందీల్లో ఎవరైనా చనిపోతే, వారి మృతదేహాలను అప్పగించాలి. అమెరికా ప్రతిపాదించిన ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన హమాస్, కచ్చితంగా దీనికి లిఖితపూర్వక హామీ కావాలని స్పష్టం చేసింది.
Israel - Palestine Conflict Explained : ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య గొడవలకు తూర్పు జెరూసలెంలోని అల్-అఖ్సా ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలెంలో ఉండే అల్-అఖ్సా ఓ మసీదు. ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్రస్థలాల్లో అల్-అఖ్సా ఒకటి. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణ చేశారని చెబుతారు. యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్మౌంట్గా అభివర్ణిస్తారు. వారికి ఈ టెంపుల్మౌంట్ అత్యంత పవిత్రస్థలం.
గొడవలకు కారణం అదే!
ఒకప్పుడు ఈ కొండపై రెండు పురాతన యూదు ఆలయాలు ఉండేవి. మెుదటిదేమో బైబిల్ ప్రకారం కింగ్ సాలమన్ నిర్మించినది. తర్వాత బాబిలోనియన్స్ దాన్ని కూలగొట్టారు. రెండోది నిర్మితమై 600 ఏళ్లు అయిన తర్వాత తొలి శతాబ్దిలో రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది. మెస్సయ్య తిరిగి వచ్చాక ఇక్కడే మళ్లీ ఆలయం కడతారని, ఇక్కడింకా దైవశక్తి ఉందని యూదుల నమ్మకం. 1967లో జరిగిన అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో, తూర్పు జెరూసలెంను జోర్డాన్ నుంచి ఇజ్రాయోల్ స్వాధీనం చేసుకుంది. ఒకప్పుడు కూల్చిన తమ ఆలయాలను పునర్నిర్మించటానికి 1990లో కొంత మంది యూదు అతివాదులు ప్రయత్నించగా, గొడవలు తీవ్రమయ్యాయి.
1994లో జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య ఓ శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అల్-అఖ్సా విషయంలో యధాతథస్థితి కొనసాగించాని నిర్ణయించారు. ఇక్కడ ప్రార్థనలకు ముస్లింలకు అనుమతించినట్లుగా, యూదులు, క్రైస్తవులకు అనుమతించరు. వారు కేవలం ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లడానికి మాత్రమే అనుమతుంది. అల్-అఖ్సా ప్రాంగణంలో ప్రార్థనలకు ఇచ్చే అనుమతుల్లో ముస్లిమేతరులపై వివక్ష చూపుతున్నారంటూ చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఇజ్రాయెల్లోని అనేక యూదు మతసంస్థలు తమకూ ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. దీంతో అల్-అఖ్సా ప్రాంగణంలో ఇజ్రాయెల్ బలగాలతో పాలస్తీనీయులు గొడవకు దిగి ఘర్షణలు జరిగాయి. తరువాత ఇజ్రాయెల్ భద్రతాదళాల సాయంతో యూదు అతివాదులు భారీ సంఖ్యలో అల్-అఖ్సా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఫలితంగా ఘర్షణ ముదిరి హమాస్ దాడులకు దారి తీసింది.
ముఖ్యంగా 2023 అక్టోబర్ 7న హమాస్ దాడులు చేసిన తరువాత, ఇజ్రాయెల్-హమాస్ మధ్య వివాదం తీవ్రమైంది. దీనితో ఇరువైపులా దాడులు, ప్రతిదాడులతో అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇంకా జరుగుతోంది. తాజాగా అమెరికా చేసిన ప్రతిపాదనకు హమాస్ అంగీకరించిన నేపథ్యంలో యుద్ధం ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి.
'త్వరలో భారత్కు రండి'- బ్రిటన్ కొత్త ప్రధాని కీర్ స్టార్మర్కు మోదీ ఆహ్వానం
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో పెజెష్కియన్ విజయం - సంస్కరణవాదికే పట్టం కట్టిన ప్రజలు!