VIP Security Changes In India : కేంద్ర ప్రభుత్వం వీఐపీల భద్రతా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలోని హై-రిస్క్ వ్యక్తులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలకు కల్పించే భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ)కు చెందిన బ్లాక్ క్యాట్ కమాండోలు, ఐటీబీపీ కమాండోలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే వీరిని వీఐపీ భద్రత నుంచి రిలీవ్ చేసి ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కోసం వినియోగించే దిశగా మోదీ సర్కారు అడుగులు వేస్తోంది. దీనిపై కేంద్ర హోం శాఖ త్వరలో సమీక్ష నిర్వహించి, వీఐపీల భద్రతా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2012 నుంచి ఉన్న ప్రతిపాదనలు ఎట్టకేలకు ఈసారి కార్యరూపు దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
450 మంది 'బ్లాక్ క్యాట్' కమాండోలు రిలీవ్
ప్రస్తుతం దేశంలోని తొమ్మిది మంది వీవీఐపీలకు ఎన్ఎస్జీకి చెందిన బ్లాక్ క్యాట్ కమాండోలు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. త్వరలోనే వీరిని వీవీఐపీ భద్రత నుంచి తప్పించి కీలకమైన ఎన్ఎస్జీకి మళ్లించనున్నారు. ఇక జెడ్ ప్లస్ కేటగిరీ కలిగిన 9 మంది వీవీఐపీలకు భద్రత కల్పించే బాధ్యతను సీఆర్పీఎఫ్ వీఐపీ సెక్యూరిటీ యూనిట్కు అప్పగించనున్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయంతో వీఐపీ భద్రతా విధుల నుంచి దాదాపు 450 మంది 'బ్లాక్ క్యాట్' కమాండోలు రిలీవ్ కానున్నారు. వాళ్లందరినీ ఇకపై మన దేశంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కోసం వినియోగించుకోనుంది.
1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్లో ఎదురైన చేదు అనుభవాలతో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి ప్రత్యేక దళం అవసరమని అప్పటి కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ ఆలోచనకు ప్రతిరూపంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులోని సిబ్బందినే బ్లాక్ క్యాట్ కమాండోలు అని పిలుస్తుంటారు. కానీ వీరిని ప్రస్తుతం వీఐపీల భద్రతకు వాడుతుండటం వల్ల ఎన్ఎస్జీ యూనిట్లో మానవ వనరులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా దేశంలో ఎక్కడైనా ఉగ్రదాడులు జరిగినప్పుడు మోహరించేందుకు సరిపడా బ్లాక్ క్యాట్ కమాండోలు అందుబాటులో ఉండటం లేదు. ఈ పరిస్థితిని గుర్తించిన మోదీ సర్కారు బ్లాక్ క్యాట్ కమాండోలను వారి పుట్టినిల్లు అయిన ఎన్ఎస్జీకి తిరిగి పంపాలని నిర్ణయించింది.
బ్లాక్ క్యాట్ కమాండోల భద్రత పొందుతున్నది వీరే
ప్రస్తుతం ఎన్ఎస్జీకి చెందిన బ్లాక్ క్యాట్ కమాండోల భద్రత పొందుతున్న ప్రముఖుల జాబితాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ సహా పలువురు ఉన్నారు.
ఐటీబీపీ స్థానంలో సీఆర్పీఎఫ్
దేశంలోని కొందరు వీఐపీలకు ప్రస్తుతం ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది భద్రత కల్పిస్తున్నారు. ఇకపై ఆ వీఐపీలకు భద్రత కల్పించే బాధ్యతను సీఆర్పీఎఫ్ లేదా సీఐఎస్ఎఫ్ వీఐపీ సెక్యూరిటీ విభాగం (స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్)కు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2020 సంవత్సరం జనవరిలో గాంధీ కుటుంబానికి భద్రత కల్పించే విధుల నుంచి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ను ఉపసంహరించుకున్నారు. వారి భద్రత బాధ్యతను కేంద్ర పారామిలిటరీ బలగాలకు అప్పగించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోభాల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా దాదాపు 200 మందికి ప్రస్తుతం కేంద్ర పారామిలిటరీ బలగాలే భద్రత కల్పిస్తున్నాయి.