SC On Kolkata Doctor Case : కోల్కతా ఆర్జీ కర్ వైద్యురాలికి సంబంధించిన ఫొటోలు, దృశ్యాలు అన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫాంల నుంచి వెంటనే తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కోల్కతా పోలీసులు ఎందుకు ఆలస్యం చేశారని మరోసారి ప్రశ్నించింది. హత్యాచార ఘటనపై సోమవారం మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. అలాగే నిరసన చేపడుతోన్న వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. మరోవైపు కేసు దర్యాప్తుపై కొత్త నివేదికను సమర్పించాలని సీబీఐని నిర్దేశించిది.
ఫొరెన్సిక్ నివేదిక కోసం మృతదేహం వద్ద సేకరించిన శాంపిల్స్ను దిల్లీ ఎయిమ్స్కు పంపాలనుకుంటున్నట్లు సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలిపారు. 'ముందుగా పోలీసులు సేకరించిన శాంపిల్స్ను బంగాల్లోని సీఎఫ్ఎస్ఎల్కు తరలించి పరీక్షలు చేశారు. ఈ నివేదిక మా దగ్గర ఉంది. ఇప్పుడు ఆ నమునాలను సీబీఐ ఎయిమ్స్ పంపాలనుకుంటుంది.' అని సుప్రీం కోర్టుకు తెలిపారు. కొత్త నివేదికను సెప్టెంబర్ 17న సమర్పించాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
'సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలి'
ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద రక్షణ కల్పిస్తోన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు బంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన ధర్మాసనం సబ్బిందికి అన్ని వసతులు కల్పించాలని, వారికి అవసరమైన రిక్విజిషన్లు, గాడ్జెట్లను వెంటనే అందజేయాలని బంగాల్ ప్రభుత్వాన్ని, సీఐఎస్ఎఫ్ని ఆదేశించింది.
విధుల్లోకి రాకపోతే కఠిన చర్యలు
మరోవైపు సుప్రీం కోర్టుకు బంగాల్ ఆరోగ్యశాఖ కూడా ఓ నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో డాక్టర్ల నిరసనల వల్ల సకాలంలో వైద్యం అందక ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలో తెలిపింది. ఈ క్రమంలో స్పందించిన సుప్రీంకోర్టు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు ఆందోళనలు చేస్తున్న డాక్టర్లు విధుల్లో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఒక వేళ విధుల్లోకి రాకపోతే వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది.