Who Is Delhi New CM : దిల్లీ కోటపై దాదాపు 27 ఏళ్ల తర్వాత కాషాయ జెండా ఎగురవేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే బీజేపీ దూసుకుపోతోంది. మరి ముఖ్యమంత్రి ఎవరు? ఇన్నేళ్ల తర్వాత అధికారంలోకి రాబోతున్న బీజేపీ, పగ్గాలను ఎవరికిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ను ఓడించిన పర్వేశ్ వర్మ పేరు సీఎం రేసులో
పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేశ్ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ దిల్లీ నుంచి లోక్సభ సభ్యుడిగా కొనసాగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈయన రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దిల్లీ చరిత్రలో ఓ లోక్సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజార్టీ ఇదే కావడం విశేషం.
అయితే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో టికెటు ఇవ్వలేదు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు దీటైన అభ్యర్థిగా ఎవర్ని దించాలన్న దానిపై బీజేపీ భారీ కసరత్తు చేసింది. చివరకు వర్మను రంగంలోకి దించింది. అధిష్ఠానం నమ్మకాన్ని నిలబెట్టుకుంట తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్నే ఓడించి పర్వేశ్ దేశం దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయనే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
రమేశ్ బిధూరి
ఫైర్బ్రాండ్ నేతల్లో ఒకరిగా రమేశ్ బిధూరికి పేరుంది. గతంలో పార్లమెంట్ లోపలా, వెలుపలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈయనకు టికెట్ నిరాకరించింది. అయితే, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ఏకంగా దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ పోటీ చేసిన కాల్కాజీ స్థానంలో నిలబెట్టడం చర్చనీయాంశమైంది. దీంతో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. తాజా ఎన్నికల్లో ఆయన ఆతిశీకి చివరి వరకు గట్టి పోటినిచ్చి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.
కైలాశ్ గహ్లోత్
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే కైలాశ్ గహ్లోత్ ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్బై చెప్పి బీజేపీలో చేరారు. జాట్ వర్గానికి చెందిన కైలాశ్ గహ్లోత్ గతంలో ఆప్ సర్కారులో రవాణా మంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో బిజ్వాసన్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన విజయం దిశగా ఉన్నారు.
మహిళా సీఎం?
మరోవైపు ముఖ్యమంత్రి రేసులో బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ పేరు కూడా వినిపిస్తోంది. దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె అయిన బన్సూరీ గతేడాదే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో న్యూదిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. దీంతో ఆమె సీఎం రేసులో నిలిచారు. ఇక, మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేరు కూడా తెరపైకి వస్తోంది. ఒకవేళ బన్సూరీ లేదా స్మృతి ఇరానీవైపు బీజేపీ మొగ్గు చూపితే ఈ పార్టీ నుంచి దిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రి రానున్నారు. సుష్మా స్వరాజ్ గతంలో దిల్లీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
అనూహ్య నిర్ణయం తీసుకుంటుందా?
బీజేపీ దిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ, పార్టీ జాతీయ కార్యదర్శి దుశ్యంత్ గౌతమ్, ఎంపీ మనోజ్ తివారీ, సీనియర్ నేతలు కపిల్ మిశ్రా, అర్వింద్ సింగ్ లవ్లీ పేర్లు కూడా సీఎం రేసులో వినిపిస్తున్నాయి. సంప్రదాయాన్ని పాటిస్తూ బీజేపీ ఎప్పటిలాగే ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే దిల్లీ బరిలోకి దిగింది. ఫలితాల తర్వాత అనేక అంశాలు, సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని సీఎంను ఖరారు చేస్తుంది. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో ఈ విషయం స్పష్టమైంది. దీంతో దిల్లీలోనూ అనూహ్యంగా మరో వ్యక్తి సీఎం రేసులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. మరి చూాడాలి బీజేపీ ఏం చేస్తుందో!