తెలంగాణ

telangana

ఒక్క డోసు పొందినా ఇన్‌ఫెక్షన్‌ ఉద్ధృతికి కళ్లెం!

By

Published : Apr 24, 2021, 10:27 AM IST

ఆక్స్‌ఫర్డ్‌ లేదా ఫైజర్‌ సంస్థలకు చెందిన కొవిడ్ టీకాను ఒక డోసు మేర పొందినా.. కరోనా ఇన్‌ఫెక్షన్లు 65 శాతం మేర తగ్గుతాయని ఒక అధ్యయనం పేర్కొంది. తొలి డోసు పొందిన 21 రోజుల తర్వాత సదరు వ్యక్తుల్లో రోగనిరోధక ప్రతిస్పందన వ్యవస్థ మెరుగుపడుతోందని తేల్చింది.

oxford vaccine,  coronavirus
ఆక్స్‌ఫర్డ్‌ టీకా, కరోనా వైరస్

ఆక్స్‌ఫర్డ్‌ లేదా ఫైజర్‌/బయోఎన్‌టెక్‌ సంస్థలకు చెందిన కరోనా టీకాను ఒక డోసు మేర పొందినా.. కరోనా ఇన్‌ఫెక్షన్లు 65 శాతం మేర తగ్గుతాయని బ్రిటన్‌లో వెలువడిన ఒక అధ్యయనం పేర్కొంది. వయోధికులు, అత్యంత దుర్భలతను ఎదుర్కొంటున్నవారిలోనూ సింగిల్‌ డోసుతో రక్షణ లభిస్తున్నట్లు వివరించింది. దీనివల్ల ఆసుపత్రిపాలు కావడం, మరణాలు తగ్గుతాయని తెలిపింది. అయితే టీకా పొందిన వారికీ కరోనా సోకొచ్చని, వ్యాధి లక్షణాలు లేకుండానే వారు ఇన్‌ఫెక్షన్లను ఇతరులకు వ్యాప్తి చేయవచ్చని హెచ్చరించింది. అందువల్ల.. వ్యాక్సిన్‌ పొందినప్పటికీ భౌతిక దూరం పాటించడం, ముఖానికి మాస్కులు ధరించడం చాలా కీలకమని పేర్కొంది.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఆఫీస్‌ ఆఫ్‌ నేషనల్‌ స్టాటిస్‌టిక్స్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. అధ్యయనంలో భాగంగా వారు.. గత డిసెంబరు నుంచి ఈ ఏప్రిల్‌ వరకూ బ్రిటన్‌లో టీకా పొందిన 3.5లక్షల మందికి సంబంధించిన డేటాను విశ్లేషించారు. తొలి డోసు పొందిన 21 రోజుల తర్వాత సదరు వ్యక్తుల్లో రోగనిరోధక ప్రతిస్పందన వ్యవస్థ మెరుగుపడుతోందని తేల్చారు. ఫలితంగా అలాంటివారిలో కొత్త ఇన్‌ఫెక్షన్లు తక్కువగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. వారిలో వ్యాధి లక్షణాలతో కూడిన ఇన్‌ఫెక్షన్లు, అధిక వైరల్‌ లోడు వంటివి చాలా తక్కువని పేర్కొన్నారు. రెండో అధ్యయనంలో 46వేల మందికి ఒక డోసు మేర టీకా వేసి, పరీక్షించామని తెలిపారు. దీనివల్ల అన్ని వయసులవారిలోనూ యాంటీబాడీ స్పందన ఉత్పన్నమైనట్లు చెప్పారు.

ఇదీ చూడండి:కొవిడ్​-19కు కొత్త ఔషధం 'విరాఫిన్​'

ABOUT THE AUTHOR

...view details