ఉద్యోగాల పేరుతో పైసా వసూల్- బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
Published : Jun 19, 2024, 9:53 PM IST
Software Company Cheat in Rayadurgam : ఉద్యోగాల పేరుతో ఆశచూపి డబ్బులు వసూలు చేసి, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసిన ఘటన రాయదుర్గంలో చోటుచేసుకుంది. రాయదుర్గం సీఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని రెయిల్ వరల్డ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సాఫ్ట్వేర్ కంపెనినీ గచ్చిబౌలిలోని టెలికంనగర్లో మే నెలలో ఏర్పాటు చేశారు. సాఫ్ట్వేర్ డెవలపర్ కంపెనీ పేరుతో బెంగళూరు, పూణే, ముంబై, హైదరాబాద్లో తదితర నగరాలలో బ్రాంచీలను ఏర్పాటు చేశారు. ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తామని ఒక్కోక్కరి నుంచి రూ.50 వేలు వసూలు చేశారు. మొత్తం 49 మంది నుంచి రూ. 18 లక్షల వరకు వసూలు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ప్రకాష్ సింగ్ పరారీలో ఉన్నారు. ఏకకాలంలో హైదరాబాద్తో పాటు పూణే, ముంబై, బెంగళూరులలో ఆఫీస్లు ఎత్తివేశారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.