KTR Fires On Congress Govt : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సచివాలయం ఎదురుగా ఇవాళ (సెప్టెంబరు 16) మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ జరుగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. 'తెలంగాణ తల్లిని అవమానిస్తారా ? తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ? తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా? తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?' అంటూ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు.
"తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా? తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా? తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు, స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా? నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన “తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట “రాహుల్ గాంధీ తండ్రి” విగ్రహం పెడతారా? తెలంగాణ కాంగ్రెస్ను క్షమించదు" అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.