నీట్పై సుప్రీంకోర్టు విచారణ జులై 18కి వాయిదా
Published : Jul 11, 2024, 1:55 PM IST
Supreme Court Neet Hearing : వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్- యూజీ 2024పై దాఖలైన పిటిషన్లను జులై 18న విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. జులై 8న దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అఫిడవిట్లను దాఖలు చేశాయని పేర్కొంది. కొంతమంది పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు కేంద్రం, ఎన్టీఏ దాఖలు చేసిన అఫిడవిట్లు ఇంకా అందలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. వాదనలకు ముందు తమ ప్రతిస్పందనను తెలిపేందుకు వారికి సమయం కావాలని చెప్పింది. ఈ మేరకు నీట్- యూజీ 2024పై దాఖలైన పిటిషన్లపై విచారణను జులై 18కి వాయిదా వేసింది.
కాగా, ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా జరిగిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు జులై 18న విచారణ జరపనుంది.