కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో ఎంపీలకు కోటా- క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Published : Jul 31, 2024, 10:45 PM IST
Kendriya Vidyalaya MP Quota :కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో పార్లమెంటు సభ్యులకు గతంలో ఇచ్చిన కోటాను పునరుద్ధరించే అంశాన్ని కేంద్రప్రభుత్వం మరోసారి తిరస్కరించింది. అటువంటి ప్రతిపాదన లేదని స్పష్టంచేసింది. రాజ్యసభలో శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జయంత్ చౌధరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. "గతంలో ఎంపీల కోటాతో సహా ప్రత్యేక విభాగాల్లో ప్రవేశాలు కల్పించేందుకు అవకాశం ఉండేది. దాంతో తరగతుల్లో విద్యార్థి-టీచర్ నిష్పత్తి(PTR) భారీగా పెరిగిపోతుంది. ఇది బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈక్రమంలో ఈ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి కేంద్రం వద్ద లేదు" అని వివరించారు. ఎంపీల కోటాలో భాగంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఒక ఎంపీ గరిష్ఠంగా 10మంది పిల్లలను సిఫార్సు చేయవచ్చు. లోక్సభ, రాజ్యసభ కలిపి 788సభ్యులుండగా వీరందరికి ఏడాదిలో 7,880మంది విద్యార్ధులను కేవీల్లో చేర్పించే విచక్షణాధికారం ఉండేది. అటు జిల్లా మేజిస్ట్రేట్లు కూడా 17మందిని సిఫార్సు చేసే అధికారం ఉండేది.