By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 6:22 PM IST
బొట్టు పెట్టి, చీర ఇచ్చి ఓటు వేయాలని వైసీపీ నేతల అభ్యర్థన- తాయిలాలను అడ్డుకునే అధికారులు ఎక్కడ?
YCP Leaders Sarees Distribution in Visakhapatnam District : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే అధికార వైసీపీ నాయకులు, వాలంటీర్లు ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు మెుదలుపెట్టారు. తాజాగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో స్థానిక వైసీపీ కార్పొరేటర్ స్వాతి వాలంటీర్లతో కలసి చీరలు పంపిణీ చేశారు. ఓటు ఉన్న మహిళల ఇంటికి వెళ్లి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీకు చీరలు ఇచ్చారని తెలిపారు. మహిళలకు నుదిటిన బొట్టు పెట్టీమరీ సీఎం జగన్, ఎంపీ సత్యనారాయణ ఫొటోలతో ఉన్న చీరల కీట్ను ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎంవీవీకే ఓటు వేయాలని అభ్యర్థించారు. అంతేగాక బిందెలు ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారు.
ఇక చీరల పంపిణీలో వాలంటీర్ల చేతిలో ఓటర్ల జాబితా ఉండటం విశేషం. ప్రజాప్రతినిధులు బహిరంగంగానే ఓటర్లకు తాయిలాలు ఇస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎక్కడా డబ్బు తరలింపు, బహుమతుల పంపిణీకి అవకాశం లేకుండా విస్తృతంగా తనిఖీలు చేయాలని గతనెల జనవరి 10న సీఈసీ రాజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇంత స్పష్టంగా ఆదేశాలిచ్చిన వైఎస్సార్సీపీ నాయకుల ప్రలోభాలను అధికారులు ఎందుకు అడ్డుకోవట్లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.