గిరిపుత్రులు కాదు వీరు సరస్వతి పుత్రులు- సొంత డబ్బుతో స్కూల్ నిర్మాణం - Tribals have built their own school
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 7, 2024, 7:58 PM IST
Tribals have Built Their Own School for Education of Children in Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిపుత్రులు సొంత నిధులతో పాఠాశాలను నిర్మించుకున్నారు. అనంతగిరి మండలం తెంగల్ బంధ ఆదివాసి గిరిజన గ్రామంలో కొండ దొర తెగకు చెందిన 29 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. 20 మంది విద్యార్థులు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న గంగవరం పాఠాశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. రోజు కాలినడకన రెండు వాగులు దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో వాగులు దాటేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది తమ గ్రామంలో ఉపాధ్యాయుడిని నియమిస్తే సొంతంగా పాఠశాలను నిర్మించుకుంటామని కలెక్టర్ దినేష్ కుమార్కు గిరిజనులు కొరారు. ఇందుకు కలెక్టర్ అంగీకరించడంతో పాఠశాల నిర్మాణం కోసం గ్రామస్థులంతా శ్రమదానం చేసి పిల్లల కోసం స్కూల్ను నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు. దీనికోసం గ్రామస్థులంత ఇంటింటికి 300 రూపాయలు విరాళాలు వేసుకుని కర్రలు, పెంకులతో పాఠాశాలను నిర్మించుకున్నారు. పిల్లల చదువు కోసం అందురూ ఏకమై పాఠశాలను నిర్మించుకోవడంతో ఆ గ్రామం పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.