తిరుమలలో వేడుకగా ధ్వజావరోహణం - తిరుచ్చి పల్లకిపై మలయప్పస్వామి
By ETV Bharat Andhra Pradesh Team
Published : 4 hours ago
Tirumala Srivari Brahmotsavam Dwajarohanam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమాయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణం కార్యక్రమంతో ముగిశాయి. శనివారం రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం ఆలయ మాడ వీధుల్లో వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు ఆలింగనం అలంకారంలో ఊరేగారు. అనంతరం ధ్వజావరోహణంతో ధ్వజ స్తంభం నుంచి గరుడ పతకాన్ని అర్చకులు దించివేయడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.
8 రోజుల పాటు వివిధ వాహనసేవలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అలరించిన మలయప్పస్వామికి చివరిరోజు పుష్కరిణిలో చక్రస్నానం కన్నులపండువగా సాగింది. ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి, చక్రత్తాళ్వర్కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా బ్రహ్మోత్సవాలను ఘనంగా ముగించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. వాహన సేవలను 15 లక్షల మంది భక్తులు వీక్షించినట్లు ఆయన వెల్లడించారు.