By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 18, 2024, 6:24 PM IST
పోలవరంను వైఎస్ కుటుంబం నాశనం చేసింది: ఎమ్మెల్సీ అనురాధ - TDP MLC Anuradha Comments on Jagan
TDP MLC Panchumarthi Anuradha Comments on Jagan: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును జగన్ అధోగతి పాలు చేశారని తెలుగుదేశం ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్ కుటుంబం నాశనం చేసిందని విమర్శించారు. పోలవరం పనులను చంద్రబాబు 72 శాతం పూర్తి చేస్తే మిగతా పనుల్ని పూర్తి చేయకపోగా జగన్ ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఒక్క రోజులో 35 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డు సృష్టించారని గుర్తు చేశారు.
ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్లు దండుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చారని ఆమె మండిపడ్డారు. సకాలంలో పోలవరం పూర్తై ఉంటే 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశాకు కూడా నీళ్లిచ్చే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉండేదని తెలిపారు. ఉత్తరాంధ్రను అభివృద్ది చేస్తానని చెప్పి జగన్ రూ. 500 కోట్లతో ప్యాలస్ కట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేది చంద్రబాబేనని ఉద్ఘాటించారు.