జగన్న కాలనీలో గోడ కూలి ఆరేళ్ల పాప మృతి - కేసు పెట్టొద్దంటూ సూపర్వైజర్ బెదిరింపులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 8:57 PM IST
Six year old Girl Died After Wall Collapsed: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఎం కొంగరవారిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి ఆరు సంవత్సరాల బాలిక మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళ్తే బాధిత కుటుంబం మధ్యప్రదేశ్ నుంచి ఎం. కొంగరవారిపల్లెకి వలస వచ్చారు. సురేష్, నిర్మల దంపతులకు ఒక పాప ఉంది. ఈ దంపతులు గ్రామంలోని జగనన్న కాలనీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారు పని చేస్తున్న దగ్గర శుక్రవారం మధ్యాహ్నం జెసీబీ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో నిర్మల, ఆమె కుమార్తె హేమాన్షి (6)లు గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డ తల్లీకూతుళ్లను తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ పాప మృతి చెందింది. ఘటనకు కారణమైన సూపర్వైజర్ బీవీ రెడ్డి బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తాను, కేసు పెట్టొద్దని బెదిరించడంతో బాధిత కుటుంబ సభ్యులు చేసేది లేక న్యాయం కోసం చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు.