గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్న ఏడుపాయల వనదుర్గాభవాని - EDUPAYALA VANADURGAMATHA TEMLE
Vanadurgamata Temple in Medak District : మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు వనదుర్గమాత అమ్మవారు గాయత్రీ దేవి(బ్రహ్మ చారిణి) అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో వనదుర్గా ఆనకట్ట పొంగిపొర్లుతుంది. గర్భగుడి ముందు నుంచి మంజీరా నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి అమ్మవారికి ఆలయ అర్చకులు మంజీరా జలాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శరన్నవరాత్రులలో భాగంగా ఏడుపాయలకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించనున్నట్లు ఆలయ ఎండోమెంట్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడిన ప్రతి సందర్భంలోనీ వనదుర్గా మాత ఆలయం జలదిగ్భందంలో చిక్కుకుంటోంది. ఈ విషయంపై భక్తులు ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తునే ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు అనేది చూడాలి.