హనుమంతుడి ఆలయం నుంచి రామయ్యకు పోచంపల్లి పట్టు వస్త్రాలు - saree from hyderabad to ayodhya
Published : Jan 20, 2024, 3:31 PM IST
Sanath Nagar Hanuman Temple Saree to Ayodhya : అయోధ్యలో శ్రీరామ మందిర్ ప్రారంభం సందర్భంగా రాముడికి పోచంపల్లి పట్టువస్త్రాలు పంపించనున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్లోని హనుమాన్ దేవాలయంలో మగ్గంపై పట్టువస్త్రాల తయారీని తలసాని ప్రారంభించారు. వేద పండితుల ఆధ్వర్యంలో రామునికి వస్త్రాలు తయారు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయోధ్య రామమందిర నిర్మాణానికి రామ భక్తులు తమకు తగ్గట్టు ఏదో రూపంలో కానుకలు అందజేస్తున్నారు.
ఇది వరకే రామ్లల్లాకు హైదరాబాద్ నుంచి భారీ లడ్డూ ప్రసాదంగా వెళ్లింది. అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ ద్వారా 8 కిలోల వెండి, ఒక కిలో బంగారంలో రాముడికి పాదుకలు చేయించి బహుకరించారు. మరోవైపు జనవరి 16వ తేదీ నుంచి రామ్లల్లా ప్రాణప్రతిష్ట పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 105 దేశాల నుంచి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు.