దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జగన్నాథ రథయాత్ర- విజయవాడలో ఇస్కాన్ ఏర్పాట్లు - Rath Yatra in Vijayawada
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 10, 2024, 3:47 PM IST
Rath Yatra Organized in Vijayawada Under the Auspices of ISKCON : పూరి జగన్నాథ రథయాత్ర తరహాలోనే విజయవాడలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అధ్యక్షుడు చక్రదారిదాస్ తెలిపారు. ఈనెల 12 నుంచి మూడు రోజులపాటు జరిగే వేడుకకు మెుదటి రోజు సీఎం చంద్రబాబును ఆహ్వానించామని వెల్లడించారు. అలాగే రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను రథయాత్రలో పాల్గొనాల్సిందిగా వ్యక్తిగతంగా ఆహ్వానించామన్నారు. ఈ రథయాత్ర బందరు రోడ్డు నుంచి పాలిటెక్నిక్ రోడ్డు, గాయత్రినగర్, గురునానక్కాలనీ, పంట కాలువ మీదుగా రామలింగేశ్వర్నగర్లోని ఇస్కాన్ మందిరానికి చేరుకుంటుందని తెలిపారు. దేశవిదేశీ కళాకారుల నృత్య సంకీర్తనలతో రథయాత్ర సాగుతుందని వెల్లడించారు.
ప్రతిరోజు ఇస్కాన్ మందిరంలో సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రథమేళా నిర్వహిస్తామన్నారు. పూరిలో జగన్నాథ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు గుండీచ మందిరంలో ఉత్సవాలు జరిగిన నమూనాను విజయవాడలోనూ నిర్మించామని తెలిపారు. అధేవిధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, హరినామ సంకీర్తనలు, నాటకాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుపుతామని వెల్లడించారు. వేడుకల్లో భాగంగా ప్రతిరోజు వేల మందికి అన్నదాన సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. ఈ రథయాత్రను 'వ్యసనాలకు దూరం' అనే నినాదంతో జరుపుతున్నామని చెప్పారు. భగవంతుని సేవలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్తోపాటు ఇతర రాష్ట్రాల భక్తులు పాల్గొని సామూహికంగా హరినామ సంకీర్తనలు చేస్తారన్నారు.