సత్యసాయి జిల్లాలో ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీం పర్యటన - రైతుల సమస్యలపై ఆరా - Central Team Visit Sathya Sai Dist
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 19, 2024, 7:21 PM IST
Central Team Tour to Sri Sathya Sai Dist : శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీం పర్యటించింది. ఇందులో భాగంగా రొద్దం మండలంలోని ఆర్.కొట్టాల గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా అక్కడి అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఎంత విస్తీర్ణంలో పంట సాగు చేశారు? పెట్టుబడి మొత్తం ఎంత అవుతుంది? దిగుబడి ఎలా ఉందన్న అంశాలపై కర్షకులను బృందం ఆరా తీసింది.
గ్రామంలో వ్యవసాయానికి సంబంధించి సాగునీటి కాలువలు చెరువులు ఉన్నాయా? అని రైతులను బృందం ప్రశ్నించింది. వ్యవసాయ బోరు బావుల్లో భూగర్భ జలం ఎన్ని అడుగుల్లో వస్తుందన్న అంశాలపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. గతేడాది సాగుచేసిన పంటలకు క్రాప్ బుకింగ్ చేశారా? ఫసల్ బీమా నమోదు చేసుకున్నారా? ఫసల్ బీమా యోజన, పెట్టుబడి రాయితీ వచ్చిందా అని పలువురు రైతులను బృందం ఆరా తీసింది. ఈ కార్యక్రమంలో టీం లీడర్, ఐఏఎస్ రితేష్ చౌహాన్ , హైదరాబాద్ డీటీఈ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ డైరెక్టర్ డా.కె.పొన్నుస్వామి, ఎంఎంసీఎఫ్సీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ సునీల్ దూబె, శ్రీ సత్య సాయి జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.