Published : 4 hours ago
గాంధీభవన్ వద్ద జీవో 317 బాధితుల నిరసన - పలువురు ఉపాధ్యాయుల అరెస్ట్ - GO 317 Teachers Arrest
GO 317 Victims Protest at Gandhi Bhavan : హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్ వద్ద 317 జీవో బాధితుల నిరసన కారణంగా కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రహదారిపై బైఠాయించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. పలువురు నాయకులు, పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో కొంత మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని తోటి ఉపాధ్యాయులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
GO 317 Teachers Arrest : ఉదయం జీవో 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఛలో గాంధీ భవన్ ముట్టడించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీల మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో 317కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జీవో పై కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని, అలాగే ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు.