సిద్దిపేట 220కేవీ సబ్స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం - fire in 220kv substation siddipet
Published : Feb 21, 2024, 10:33 PM IST
Fire Accident In Siddipet Power Sub Station : సిద్ధిపేటలో ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ సబ్స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్ని ప్రమాదం కారణంగా పట్టణంలో విద్యుత్ నిలిచిపోయింది.
Power Sub Station Fire Accident : విద్యుత్ ట్రిప్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుందని ఇంజినీర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు. దాదాపు రూ. 2 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రమాదం జరిగిన తీరు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.