'బీఆర్ఎస్ నాయకులు వాళ్లలో వాళ్లే కొట్లాడుకుని - శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు' - Mallu Ravi Fire On BRS
Published : Sep 13, 2024, 1:32 PM IST
Mallu Ravi Fire On BRS : బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయాక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలం అవుతున్నారని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు వాళ్లలో వాళ్లే కొట్లాడుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉంటే ప్రశ్నించాలి, లేదంటే నిరసన వ్యక్తం చేయడానికి ధర్నా చౌక్ ఉందని ఆయన సూచించారు.
ఇళ్లపై దాడులు చేయడం సరైంది కాదని హితవు పలికారు. పోలీసులపైనే దాడులు చేసి బీఆర్ఎస్ దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల హైదరాబాద్కు ఐటీ కంపెనీలు, పెట్టుబడులు రాకుండా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా, ఏనాడూ వ్యవస్థల మీద దాడులు చెయ్యలేదని, రాజ్యాంగ హక్కులను ఉపయోగించుకుని మాత్రమే పని చెయ్యాలన్నారు. వ్యవస్థకు వ్యతిరేకంగా పని చెయ్యొద్దని సూచించారు.