ఇంట్లో 8 మంది వలస కూలీలు - చుట్టుముట్టిన వరద నీరు - చివరకు ఏమైందంటే? - 8 People Trapped in The River - 8 PEOPLE TRAPPED IN THE RIVER
Published : Sep 4, 2024, 12:19 PM IST
8 People Trapped in The River In Siddipet : సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోహెడ మండలం బస్వాపూర్లో ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో మోయ తుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉద్ధృతితో సమీపంలోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. జాతీయ రహదారి పనులు చేయడానికి వచ్చి ఓ ఇంట్లో ఉంటున్న ఎనిమిది మంది యూపీ వలస కూలీలు వరద నీటిలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.
వెంటనే రెస్క్యూ టీమ్ సహాయంతో ఎనిమిది మంది కూలీలను వరద నీటి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వలస కూలీలకు ఆహారం అందించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ప్రమాదకరంగా మారాయని, గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. సకాలంలో స్పందించి 8 మంది ప్రాణాలను కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.